Earthquake : ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. శనివారం రాత్రి దేశంలోని పశ్చిమ జావా ప్రావిన్స్లో 6.5 తీవ్రతతో సముద్రగర్భంలో భూకంపం(Earthquake) వచ్చింది. భూకంపం ధాటికి దేశ రాజధాని జకార్తాలో ఎత్తైన భవనాలు ఒక నిమిషం పాటు ఊగిసలాడాయి. పశ్చిమ జావా ప్రావిన్షియల్ రాజధాని బాండుంగ్లో, జకార్తాలోని శివారు నగరాలైన డెపోక్, టాంగెరాంగ్, బోగోర్, బెకాసిలలోనూ ఇళ్లు బలంగా కంపించాయి. ఇండోనేషియా రాజధాని జకార్తా సమీపంలోని బాంటెన్ ప్రావిన్స్తో పాటు సెంట్రల్ జావా, యోగ్యకార్తా, తూర్పు జావా ప్రావిన్స్లలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలను ప్రజలు ఫీలయ్యారని తెలుస్తోంది. పశ్చిమ జావా ప్రావిన్స్లోని సుకబూమి, తాసిక్మలయా పట్టణాల్లో నాలుగో నంబరు మోడిఫైడ్ మెర్కల్లీ ఇంటెన్సిటీ (ఎంఎంఐ)తో భూకంపం వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join
పశ్చిమ జావా ప్రావిన్స్ రాజధాని బాండుంగ్ నగరంలో మూడు నుంచి నాలుగు ఎంఎంఐ తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. శనివారం జకార్తా కాలమానం ప్రకారం అర్ధరాత్రి 23:29 గంటలకు ఈ భూకంపం చోటుచేసుకుంది. భూకంప కేంద్రం గరుత్ రీజెన్సీకి నైరుతి దిశలో 151 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉందని ఇండోనేషియా అధికారులు తెలిపారు. ఇక బంజార్ నగరానికి దక్షిణంగా 102 కిలోమీటర్ల (63 మైళ్లు) దూరంలో 68.3 కిలోమీటర్ల (42.4 మైళ్లు) లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. దీనివల్ల సముద్రంలో భారీ తరంగాలు కానీ, అలలు కానీ ఏర్పడలేదు. దీంతో సునామీ హెచ్చరికను జారీ చేయలేదు. ద్వీప సమూహ దేశమైన ఇండోనేషియా ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలిచే అత్యంత సున్నితమైన భూకంప ప్రభావిత జోన్లో ఉంది. అందుకే ఈ దేశంలో భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి.
పశ్చిమ జావాలోని సియాంజూర్ నగరంలో 2022 సంవత్సరంలో 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 602 మంది మరణించారు. సులవేసిలో 2018లో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా 4,300 మంది చనిపోయారు. 2004లో సంభవించిన అత్యంత శక్తివంతమైన హిందూ మహాసముద్ర భూకంపం వల్ల దాదాపు డజను దేశాల్లో 2.30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆనాడు చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఇండోనేషియాలోని అచే ప్రావిన్స్కు చెందినవారే.