Dubai Road Accident: షార్జాలో భారీ ట్రక్కు ఢీకొనడం (Dubai Road Accident)తో పికప్ వాహనం బోల్తా పడటంతో ఒక భారతీయుడు, ముగ్గురు పాకిస్థానీలు అక్కడికక్కడే మృతి చెందారు. షార్జా-అల్ దైద్ రోడ్డులో అల్ దైద్ బ్రిడ్జ్, అల్ జుబైర్ జిల్లా మధ్య బుధవారం ఉదయం 5.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని ఖలీజ్ టైమ్స్ నివేదించింది. షార్జా పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కల్నల్ అబ్దుల్లా అల్ దుఖాన్ మాట్లాడుతూ.. పికప్ వాహనం షార్జా-దైద్ రహదారిలో హైవే కుడి వైపు చూడకుండా ప్రవేశించడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు.
అతివేగంగా వెళ్తున్న లారీ డ్రైవర్ కూడా అకస్మాత్తుగా లేన్లోకి వాహనం వస్తుందని ఊహించలేదని.. ఇసుకతో కూడిన లారీ పికప్ను ఢీకొట్టడంతో పికప్ వాహనం చాలాసార్లు బోల్తా పడిందన్నారు.
Also Read: Suicide News: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి
నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి
ఈ ప్రమాదంలో ట్రక్కు ఇంజన్ క్యాబిన్ నుంచి విడిపోయి పికప్పై పడిందని, నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారని కల్నల్ అల్ దుఖాన్ తెలిపినట్లు ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అంబులెన్స్ను సంఘటనా స్థలానికి పంపించారు. ట్రక్కు డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. నలుగురు ప్రయాణికుల మృతదేహాలను అల్ కువైట్ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు.
ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు
అల్ దైద్ రోడ్డులో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల, ఇదే రహదారిపై కూలీలతో వెళ్తున్న బస్సుపైకి ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు ఆసియా వలసదారులు మరణించారు. 15 మంది గాయపడ్డారు.