డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

Donald Trump రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయన్న కారణంతో అమెరికా.. కొంత కాలంగా భారత్ సహా చైనా, బ్రెజిల్ వంటి దేశాల్ని లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా దేశాలపై దిగుమతి సుంకాల్ని పెంచగా ఇప్పుడు మరో అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ ఏకంగా 500 శాతం వరకు సుంకాల్ని ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది. ఈ బిల్లును ట్రంప్ ఆమోదించినట్లుగా తెలుస్తోంది. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి […]

Published By: HashtagU Telugu Desk
donald trump modi

donald trump modi

Donald Trump రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయన్న కారణంతో అమెరికా.. కొంత కాలంగా భారత్ సహా చైనా, బ్రెజిల్ వంటి దేశాల్ని లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా దేశాలపై దిగుమతి సుంకాల్ని పెంచగా ఇప్పుడు మరో అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ ఏకంగా 500 శాతం వరకు సుంకాల్ని ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది. ఈ బిల్లును ట్రంప్ ఆమోదించినట్లుగా తెలుస్తోంది.

అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్.. తన కఠిన వాణిజ్య విధానాలతో.. దూకుడైన నిర్ణయాలతో ప్రపంచ దేశాల్ని ఉలిక్కిపడేలా చేస్తున్నారు. వచ్చీ రాగానే మెక్సికో, కెనడా వంటి దేశాల్ని లక్ష్యంగా చేసుకొని భారీగా సుంకాల్ని విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైనాతో సుదీర్ఘంగా వాణిజ్య యుద్ధమే జరిగింది. వరుసగా చైనాపై సుంకాలు పెంచుతూ పోయి ఆ దేశం దిగొచ్చేలా చేశారు. ఇలా ఒక్కటేంటీ.. తన మాట వినని ఏ దేశంపై అయినా ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇటీవల వెనెజువెలాపైనా మెరుపు దాడులు నిర్వహించి.. ఆ దేశ అధ్యక్షుడిని, ప్రథమ పౌరురాలిని అమెరికాకు తీసుకొచ్చేలా చేశారు. ఇలా అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితికి కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.

ఇక కొంత కాలంగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాను తప్పుబడుతున్న ట్రంప్.. ఈ క్రమంలోనే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా రష్యాతో చమురు వ్యాపారం చేస్తున్న భారత్‌తో పాటు బ్రెజిల్, చైనాలపై విపరీతంగా సుంకాలు పెంచుకుంటూ పోయారు. ఒక దశలో భారత్‌పై చాలా తక్కువగా సుంకాలు ఉండేవి. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న కారణంతోనే తొలుత 25 శాతానికి.. తర్వాత 50 శాతానికి దిగుమతి సుంకాల్ని పెంచేశారు ట్రంప్.

తర్వాత కూడా పలుమార్లు భారత్‌ను ఈ విషయంలో హెచ్చరిస్తూనే వచ్చారు. ఇటీవల మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ మంచి స్నేహితుడని పొగుడుతూనే.. రష్యా విషయంలో తన మాట వినట్లేదని.. మరోసారి టారిఫ్స్ పెంచేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఇప్పుడు ఈ దిశగా మరింత ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. రష్యా ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా.. యూఎస్ సెనెటర్ లిండ్సే గ్రాహం రూపొందించిన.. శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్- 2025 కు ట్రంప్ మద్దతు.. ఆమోదం.. ప్రకటించారు. బుధవారం రోజు ట్రంప్‌తో సమావేశమైన అనంతరం.. లిండ్సే ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇక్కడ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తున్న భారత్, బ్రెజిల్, చైనా వంటి దేశాలు.. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేసేందుకు నిధుల్ని సమకూరుస్తున్నట్లు బిల్లు అభిప్రాయపడుతోంది. ఈ కొత్త బిల్లు ప్రకారం.. రష్యా నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని వస్తువులు, సేవలపై కనీసం 500 శాతం సుంకం విధించనున్నారు. రష్యాతో వ్యాపార, ఇతర సంబంధాలు ఉన్న వ్యక్తులు, సంస్థలు, దేశాలపైనా భారీ సుంకాలతో సహా కఠినమైన ఆంక్షలు విధించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. వచ్చే వారమే ఈ బిల్లుపై సెనేట్‌లో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. భారత్ వంటి దేశాలకు మరిన్ని చిక్కులు ఎదురయ్యే పరిస్థితి తలెత్తుతుందని చెప్పొచ్చు. భారత్- అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత క్షీణించే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే చాలా నెలలుగా రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నా ఇప్పటికీ ఒప్పందం కుదరలేదు. ఈ క్రమంలో.. ట్రంప్ మరోసారి భారత్‌పై టారిఫ్స్ పెంచుతానని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది.

  Last Updated: 08 Jan 2026, 10:04 AM IST