Dalai Lama Vs China: టిబెట్ బౌద్ధ గురువు దలైలామా కీలక ప్రకటన చేశారు. చైనా బయటే తన వారసుడు జన్మిస్తాడని ఆయన వెల్లడించారు. తన తర్వాత కూడా దలైలామా వారసత్వం కొనసాగాలన్నారు. ‘‘పూర్వీకుల పనిని ముందుకు తీసుకెళ్లటానికి ఉద్దేశించిందే పునర్జన్మ. కొత్త దలైలామా చైనా బయట స్వేచ్ఛా ప్రపంచంలో జన్మిస్తాడు. విశ్వకరుణ కోసం అతడు గళం వినిపిస్తాడు’’ అని దలైలామా పేర్కొన్నారు. ‘‘నా పునర్జన్మ టిబెట్ బయట జరగొచ్చు. అది భారత్లో కూడా కావచ్చు’’ అని ఆయన తెలపడం గమనార్హం. తన వారసుడిగా చైనా ప్రకటించే వ్యక్తికి ఎటువంటి గౌరవం లభించదని స్పష్టం చేశారు. తన కొత్త పుస్తకం ‘వాయిస్ ఫర్ ది వాయిస్లెస్’లో ఈవివరాలను దలైలామా ప్రస్తావించారు. దలైలామా ప్రస్తుతం భారత్లోని హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయన అక్కడి నుంచే తన వారసుడిని ఎంపిక చేయనున్నారు.
Also Read :Pranay Murder Case : ప్రణయ్ హత్య కేసు.. ఉరిశిక్ష పడిన సుభాష్శర్మ వివరాలివీ
ప్రస్తుత దలైలామా గురించి..
- దలైలామా(Dalai Lama Vs China) అనేది టిబెటన్ బౌద్ధుల అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక గురువు హోదా.
- ప్రస్తుతం 14వ దలైలామాగా.. టిబెట్కు చెందిన టెంజియన్ గ్యాట్సో వ్యవహరిస్తున్నారు.
- ప్రస్తుత దలైలామా (టెంజియన్ గ్యాట్సో) 23వ ఏటే టిబెట్ నుంచి భారత్కు వలస వచ్చారు. తమ ప్రాంతాన్ని చైనా ఆక్రమించడాన్ని ఆయన తప్పుపట్టారు. దలైలామాకు 1989లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
- దలైలామా భారత్లోని ధర్మశాలలో ఉండటం చైనాకు గిట్టడం లేదు. చైనా గడ్డపై నుంచే వారసుడి గురించి ప్రకటన చేయాలని దలైలామాను డిమాండ్ చేస్తోంది.
- టిబెటన్ బౌద్ధుల దృష్టిలో దలైలామా తర్వాతి స్థానం పాంచెన్ లామాది. ఈ పదవికి దలైలామా ఎంపిక చేసిన బాలుడిని చైనా తిరస్కరించింది. తానే మరో బాలుడిని నియమించింది. అయితే అతడికి టిబెటన్ల ఆమోదం లభించలేదు.
- ఈ నేపథ్యంలో ఇప్పుడు తన వారసుడి ఎంపికపై దలైలామా కసరత్తును వేగవంతం చేయడం గమనార్హం.
Also Read :X Cyber Attack: ‘ఎక్స్’పై సైబర్ ఎటాక్.. ‘డార్క్ స్టార్మ్’ పనా ? ‘ఉక్రెయిన్’ పనా ?
చైనా రియాక్షన్
దలైలామా వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ భగ్గుమంది. ‘‘మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కుట్రలకు దలైలామా తెర తీస్తున్నారు. మరో దేశం (భారత్)లో పునరావాసం పొందిన దలైలామా, చైనా వ్యతిరేక చేష్టల్లో భాగం అవుతున్నారు. దలైలామా వ్యాఖ్యల వల్ల టిబెట్ విషయంలో చైనా వైఖరిలో మార్పు రాదు. తదుపరి దలైలామా ఎంపిక అనేది చైనా పరిధిలోని అంశం. మేమే నిర్ణయం తీసుకుంటాం’’ అని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.