Site icon HashtagU Telugu

Mauritius : సంస్కృతి, సంప్రదాయాలు మనల్ని కలిపి ఉంచుతున్నాయి: ప్రధాని

Culture and traditions keep us together: PM Modi

Culture and traditions keep us together: PM Modi

Mauritius : ప్రధాని మోడీ మారిషస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ 140 కోట్ల మంది భారతీయుల తరఫున మారిషస్ ప్రజలకు నేషనల్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. మారిషస్ తమకు కీలక భాగస్వామి అనిప్రధాని అన్నారు. ఈ రెండు దేశాల బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకెళ్లాలని ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం, నేను నిర్ణయించాం. మారిషస్‌లో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి భారత్‌ సహకరించనుంది. ప్రజాస్వామ్యానికి తల్లి వంటి భారత్‌ నుంచి మారిషస్‌కు ఇదొక కానుకగా భావిస్తున్నాం అని మోడీ అన్నారు.

Read Also: White House: భారతదేశంలో అమెరికన్ మద్యంపై 150% సుంకం.. వైట్ హౌస్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

నేషనల్ డే రోజున మరోసారి మీముందు ఉండటం నా అదృష్టం. మన రెండు దేశాలను అనుసంధానించేది హిందూ మహాసముద్రం మాత్రమే కాదు. సంస్కృతి, సంప్రదాయాలు మనల్ని కలిపి ఉంచుతున్నాయి. పది సంవత్సరాల క్రితం ‘సెక్యూరిటీ అండ్ గ్రోత్‌ ఫర్ ఆల్ ఇన్‌ ది రీజియన్’కు మారిషస్‌ నుంచే పునాది వేశాం. ఈ ప్రాంత శ్రేయస్సు, స్థిరత్వం కోసం సాగర్ విజన్‌తో ముందుకొచ్చాం. గ్లోబల్‌ సౌత్‌ దేశాల కోసం మహాసాగర్ విజన్‌ను ప్రకటిస్తున్నాం. వాణిజ్యం, పరస్పర భద్రత అంశాలపై దానికింద పనిచేస్తాం అని మోడీ తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలో చైనా తన ప్రభావాన్ని విస్తరించేందుకు చేస్తోన్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ మహాసాగర్ ప్రకటన వచ్చింది.

మరోవైపు నవీన్‌చంద్ర రామ్‌గులాం మాట్లాడుతూ..భారత ప్రధాని మోడీ రాక రెండు దేశాల బంధానికి నిదర్శనం అని అన్నారు. నేషనల్ డే వేడుకల్లో భాగంగా ప్రధాని మోడీ మా దేశంలో పర్యటించడాన్ని గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ సమావేశం అనంతరం పోర్ట్‌ లూయీలోని చాంప్‌ డి మార్స్ వద్ద మారిషస్ నేషనల్ డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా మోడీ పాల్గొన్నారు. ఆ వేడుకలు వీక్షించేందుకు అక్కడికి వచ్చిన పలువురు ప్రజలు జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ ఈవెంట్‌లో ఐఎన్‌ఎస్ ఇంఫాల్, నౌకాదళానికి చెందిన హెలికాప్టర్, నౌకాదళం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Read Also: Telangana Assembly : మార్చి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు..19న బడ్జెట్‌