Strait Of Hormuz: మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుండి ఒక ముఖ్యమైన వార్త వెలువడింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ను తెరిచి ఉంచేందుకు ప్రవేశపెట్టిన ఒక భారీ తీర్మానం వీటో పవర్ అడ్డుతగలడంతో నిలిచిపోయింది. ఏప్రిల్ 2న బహ్రెయిన్ నాయకత్వంలో గల్ఫ్ దేశాలు UNSCలో ఈ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశ్యం ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ సముద్ర మార్గాన్ని పూర్తిగా తెరిచి ఉంచడం, అక్కడ ఎదురవుతున్న ఆటంకాలను తొలగించడం. ఈ మార్గాన్ని సాఫీగా ఉంచడానికి ‘అవసరమైన అన్ని మార్గాలను’ ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వాలని బహ్రెయిన్ కోరింది. సరళంగా చెప్పాలంటే ఈ ప్రతిపాదనలో ఇరాన్ వ్యతిరేకతను అధిగమించడానికి సైనిక చర్య తీసుకునే అవకాశం కూడా ఉంది.
అడ్డుపడిన చైనా, రష్యా
ఈ తీర్మానంపై భద్రతా మండలిలో తీవ్ర చర్చలు జరిగాయి. ముసాయిదాలో అనేకసార్లు మార్పులు చేసినప్పటికీ ‘బలప్రయోగం’ అనే పదం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇరాన్కు సన్నిహిత దేశాలైన రష్యా, చైనా తమ వీటో అధికారాన్ని ఉపయోగించి ఈ తీర్మానాన్ని తిరస్కరించాయి. ఇటువంటి చర్యలు ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని వారు వాదించారు.
Also Read: సంజూ శాంసన్పై ప్రధాని మోదీ ప్రశంసలు!
ఫ్రాన్స్ అసమ్మతి
ఈ విషయంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రష్యా-చైనాతో పాటు ఫ్రాన్స్ కూడా తన అసమ్మతిని వ్యక్తం చేసింది. ఫ్రాన్స్ వీటోను ఉపయోగించనప్పటికీ సైనిక చర్య కంటే దౌత్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. శాంతియుత మార్గాల ద్వారా పరిష్కారాన్ని కనుగొనే ప్రతిపాదనకే ఫ్రాన్స్ మద్దతు తెలిపింది.
అటకెక్కిన తీర్మానం
తీవ్ర చర్చలు, భిన్నాభిప్రాయాల అనంతరం, ఈ తీర్మానంపై చివరికి ఓటింగ్ జరిగే పరిస్థితి కూడా రాలేదు. ప్రముఖ దేశాల వ్యతిరేకత కారణంగా బహ్రెయిన్ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదన నిలిచిపోయింది. ప్రస్తుతానికి ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ విషయంలో దౌత్యపరమైన ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనివల్ల ప్రపంచ చమురు సరఫరా, భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
