China Bans iPhone: యాపిల్ ఐఫోన్లు, ఇతర విదేశీ బ్రాండెడ్ మొబైల్ ఫోన్లను ఉపయోగించరాదని ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అధికారులను చైనా (China Bans iPhone) ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా వీటిని కార్యాలయానికి తీసుకురావడంపై నిషేధం విధించారు. ఇటీవలి వారాల్లో వివిధ ప్రభుత్వ సంస్థల సీనియర్ అధికారులు తమ జూనియర్ ఉద్యోగులకు చాట్ గ్రూపులు,సమావేశాలలో ప్రభుత్వం ఈ ఆర్డర్ గురించి తెలియజేసారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించడం, సైబర్ భద్రతను పెంచడంపై చైనా ఈ చర్య తీసుకుంది. విదేశీ బ్రాండ్ పరికరాల ద్వారా దేశ సరిహద్దుల వెలుపల ఎలాంటి సున్నితమైన సమాచారం వెళ్లకూడదని చైనా కోరుతోంది. చైనా సమాచారాన్ని పరిమితం చేసే పనిలో ఉంది. విదేశీ బ్రాండ్ ఫోన్ల ద్వారా గూఢచర్యం చేయవచ్చని చైనా భావిస్తోంది.
యాపిల్.. చైనా నుంచి భారీగా డబ్బు సంపాదిస్తోంది
చైనా ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా చైనాలో ఉన్న యాపిల్ తో సహా విదేశీ బ్రాండ్లు గణనీయమైన నష్టాలను చవిచూడవచ్చు. యాపిల్ చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ ఫోన్ బ్రాండ్. యాపిల్ అతిపెద్ద మార్కెట్ కూడా చైనానే. కంపెనీ తన లాభాల్లో 19 శాతం చైనా నుంచి పొందుతోంది. చైనా ప్రభుత్వ ఆదేశం ఎంత కఠినంగా అమలు చేయబడుతుందో స్పష్టంగా లేదు. ఈ విషయంపై యాపిల్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Also Read: G20 Summit Delegates: G20 ప్రతినిధులకు బంగారం, వెండి పూత పూసిన పాత్రల్లో భోజనం..!
ఇప్పటికే ఆంక్షలు అమలు
కొన్ని ప్రభుత్వ సంస్థల అధికారుల కోసం ఐఫోన్ల వినియోగాన్ని చైనా ఇప్పటికే నిషేధించింది. కొత్త ఆర్డర్ ప్రకారం నిషేధం పరిధిని విస్తరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఈసారి ఆంక్షలు కఠినంగా అమలవుతాయని భావిస్తున్నారు. చైనా ప్రభుత్వం కొత్త ఆర్డర్ చైనా, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతను చూపుతోంది. టెక్నాలజీ ఉత్పత్తుల విషయంలో అమెరికా, చైనాలు పరస్పరం నిషేధం విధిస్తూనే ఉన్నాయి.
వాస్తవానికి అమెరికా ఇటీవల Huaweiపై ఆంక్షలు విధించింది. అదనంగా అమెరికన్ అధికారులు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్టాక్ను ఉపయోగించకుండా నిషేధించారు. అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనగా చైనా కొత్త డిక్రీని జారీ చేసిందని తెలుస్తుంది. డేటా లీకేజీ భయం రెండు దేశాలను వెంటాడుతోంది. చైనా గూఢచర్యానికి పాల్పడుతోందని అమెరికా చాలా కాలంగా ఆరోపిస్తోంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను చైనా ఖండిస్తోంది.