US-Israel-Iran War హార్మూజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ నుంచి తమకు ఒక అమూల్యమైన బహుమతి అందిందని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే ఈ బహుమతి అణు సంబంధమైనది కాదని, కానీ చమురు, సహజ వాయువు సరఫరాకు సంబంధించినదని ఆయన పేర్కొన్నారు. కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఆయన ఇంకా వెల్లడించలేదు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ, ఇరాన్ అణ్వాయుధాల తయారీని శాశ్వతంగా విరమించుకునేందుకు అంగీకరించిందని కూడా ట్రంప్ ప్రకటించారు.
గత కొంతకాలంగా మధ్య ప్రాచ్యాన్ని వణికిస్తున్న ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మంగళవారం వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడిన ఆయన ఇరాన్ వ్యవహారంలో అత్యంత కీలకమైన పరిణామాలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా హార్మూజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ నుంచి తమకు ఒక అద్భుతమైన బహుమతి అందిందని, దాని విలువ అపారమని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.
ఇరాన్ ఇచ్చిన బహుమతి అసలు ఏంటి?
ఇరాన్ పంపిన ఈ బహుమతి అణు సంబంధమైనది కాదని, కానీ చమురు, సహజ వాయువు సరఫరాకు సంబంధించినదని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా, “నిన్న వారు ఒక అద్భుతమైన పని చేశారు. ఆ బహుమతి ఈరోజే మాకు చేరింది. అది చాలా పెద్దది” అంటూ ట్రంప్ ఉత్సాహం వ్యక్తం చేశారు. అయితే ఆ బహుమతికి సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇరాన్ తన అణు విధానంలో భారీ మార్పులు చేసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. అణ్వాయుధాలను తాము ఎప్పటికీ తయారు చేయబోమని ఇరాన్ స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వంలో ఇప్పటికే గణనీయమైన మార్పులు వచ్చాయని, వారు ఒప్పందం కోసం ఎంతో ఆతృతగా ఉన్నారని వెల్లడించారు. తాము కూడా సరైన వ్యక్తులతోనే చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
యుద్ధంలో ఇరాన్పై తాము విజయం సాధించామని ట్రంప్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అయితే ఈ యుద్ధం ఇంత త్వరగా ముగిసిపోవడం తన రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ను కొంత నిరాశకు గురిచేసిందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఇకపై ఇరాన్తో జరగబోయే కీలక చర్చల కోసం ట్రంప్ ఒక శక్తివంతమైన బృందాన్ని ప్రకటించారు. అందులో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్లు ఉన్నారు. ఈ బృందం నేతృత్వంలో జరగబోయే చర్చలు మధ్య ప్రాచ్యంలో శాశ్వత శాంతిని తీసుకువస్తాయని వైట్హౌస్ వర్గాలు భావిస్తున్నాయి.
