53 Killed : పాపువా న్యూగినియా దేశంలో సికిన్, కైకిన్ అనే గిరిజన తెగల మధ్య జరిగిన హింసాకాండలో 53 మంది చనిపోయారు. దేశ రాజధాని పోర్ట్ మోర్స్బీకి వాయవ్యంగా 600 కిలోమీటర్ల దూరంలోని వాబాగ్ పట్టణం సమీపంలో ఈ హింస చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. 53 మంది మృతదేహాలను(53 Killed) సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నామని స్థానిక పోలీసు కమిషనర్ డేవిడ్ మానింగ్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా పలు గిరిజ తెగల మధ్య ఈవిధమైన ఘర్షణలు జరుగుతున్నాయని వివరించారు. ఇరువర్గాలు తుపాకులతో విచక్షణారహితంగా పరస్పరం కాల్పులు జరుపుకున్నాయని చెప్పారు. రోడ్డు పక్కన రక్తసిక్తమై పడి ఉన్న మృతదేహాలను పోలీసు అధికారులు మీడియా ప్రతినిధులకు చూపించారు. ఈ ఘటన నేపథ్యంలో వాబాగ్ పట్టణంలో భారీగా సైనికులను మోహరించారు.
We’re now on WhatsApp. Click to Join
సికిన్, కైకిన్ అనే గిరిజన తెగల మధ్య ప్రతీకార దాడుల కారణంగా గతంలోనూ గర్భిణులు, చిన్నారులు సహా వందలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలపై అప్పట్లో జరిపిన దర్యాప్తులలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆ తెగలకు చెందిన కొందరు వాడిన తుపాకులు పోలీసుల నుంచి అందినవేనని వెల్లడైంది. సమస్యాత్మక ప్రాంతాల్లో తగిన సంఖ్యలో పోలీసులను మోహరించకపోవడం వల్ల ఈ తెగల మధ్య గొడవలను కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా పోతోందనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.
తాజాగా 53 మంది చనిపోయిన నేపథ్యంలో ప్రధానమంత్రి జేమ్స్ మరాపేపై విపక్ష పార్టీల నేతలు ఫైరయ్యారు. వెంటనే స్థానిక పోలీసు ఉన్నతాధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో తగిన సంఖ్యలో పోలీసులను మోహరించాలని కోరారు. పాపువా న్యూ గినియా దేశ జనాభా 1980 సంవత్సరం నుంచి రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. దీనివల్ల స్థానికంగా ఉన్న భూమి, ఇతర సహజ వనరులపై ఒత్తిడి పెరిగింది. వీటిపై పట్టు కోసమే స్థానిక గిరిజన తెగలు పరస్పర పోటీపడుతూ.. ఈవిధంగా హింసకు దిగుతున్నాయి.