Indian Women Killed : అది దారుణమైన రోడ్డు ప్రమాదం. ఎస్యూవీ కారు అతి వేగంగా ప్రయాణిస్తూ బ్రిడ్జి మీదకు రాగానే అదుపు తప్పింది. అనంతరం అది బ్రిడ్జిపై నుంచి 20 అడుగులపైకి ఎగిరి ఎదురుగా ఉన్న చెట్లను ఢీకొట్టింది. దీంతో ఆ కారులోని ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఘటన పూర్తి వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
ఈ ఘోర ప్రమాదం అమెరికాలోని సౌత్ కరోలినాలో ఉన్న గ్రీన్విల్లే కౌంటీ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్యూవీ కారు అతి వేగంగా ప్రయాణిస్తూ సౌత్ కరోలినాలోని గ్రీన్విల్లే కౌంటీలోని బ్రిడ్జిపైకి ఎంటరైంది. అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ.. కారుపై డ్రైవర్ పూర్తిగా అదుపు కోల్పోయాడు. ఒక్కసారిగా వేగం పెరిగిపోయింది. దీంతో కారు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి 20 అడుగుల పైకి ఎగిరి ఎదురుగా ఉన్న చెట్లను ఢీకొట్టింది. అనంతరం నేలకూలింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జుగా అయింది దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు మహిళలు చనిపోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిని గుజరాత్లోని ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్గా గుర్తించారు.
ఈ ఘటనలో మిగతా వాహనాల ప్రమేయం లేదని, ఇతర వాహనాలేవీ ఆ కారును ఢీకొనలేదని గ్రీన్విల్లే కౌంటీ కరోనర్స్ అధికారులు ప్రకటించారు. కారు 4-6 లేన్ల రోడ్డును దాటుకుని గాల్లోకి ఎగిరి చెట్టుపై ఇరుక్కుపోయిందన్నారు. కారు ఇంత పైకి ఎగరడం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పారు. కారు అత్యంత వేగంగా వెళ్లడం వల్లే ఇంత ఘోరమైన ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్నటువంటి క్రాష్ డిటెక్షన్ సిస్టమ్ అలర్ట్ అయిందని.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం చేరిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన వారి కుటుంబ సభ్యులే సౌత్ కరోలినాలోని స్థానిక అధికారులను అప్రమత్తం చేశారని చెప్పారు. వెంటనే హైవే పెట్రోల్, గాంట్ ఫైర్ అండ్ రెస్క్యూ సహా అత్యవసర ప్రతిస్పందన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు నిర్వహించాయని పేర్కొన్నారు.