Volcano Eruption : పేలిన అగ్నిపర్వతం.. 11 మంది సజీవ దహనం

Volcano Eruption : ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో ఉన్న మరాపి అగ్నిపర్వతంలో భారీ పేలుడు సంభవించింది.

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 09:21 AM IST

Volcano Eruption : ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో ఉన్న మరాపి అగ్నిపర్వతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు చనిపోయారు. 9,484 అడుగుల ఎత్తులో ఉండే ఈ అగ్ని పర్వతం పేలడంతో  3,000 మీటర్ల  మేర బూడిద రాశి గగనతలంలోకి ఎగిసిపడింది. ఈ పేలుడు సంభవించిన టైంలో మొత్తం 26 మంది పర్వతారోహకులు  అగ్నిపర్వతంపై ఉన్నారు. వారిలో 14 మందిని గుర్తించారు. అయితే పేలుడు ధాటికి 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా 12 మంది ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

శనివారం నుంచి ఈ అగ్నిపర్వతంపైకి దాదాపు 75 మంది పర్వతారోహకులు వెళ్లారు. వారిలో 49 మంది కిందికి దిగారు. పైన మిగిలిపోయిన 26 మంది అగ్నిపర్వతం పేలుడు బారినపడ్డారు. మరాపి అనేది ఇండోనేషియాలో రెండో ప్రమాద  హెచ్చరిక స్థాయి కలిగిన అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతంపైకి వెళ్లినా.. లావా నిల్వ ఉండే బిలానికి 3 కిలోమీటర్ల దూరం నుంచే దాన్ని చూడాల్సి ఉంటుంది. ఇండోనేషియా ద్వీపసమూహం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంది. దీంతో ఈ దేశంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.  ఆగ్నేయాసియా ప్రాంతంలో దాదాపు 130 యాక్టివ్ అగ్నిపర్వతాలు(Volcano Eruption)  ఉన్నాయి.

Also Read: Yuvagalam : నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్.. కార‌ణం ఇదే..?