దేవుడికి నమ్మేవారికి దేవుడిపై భక్తి ఉండడం అన్నది కామన్. కొన్ని కొన్ని సార్లు ఆ భక్తి మితిమీరితే పలు రకాల సమస్యలు తప్పవు. దేవుడిపై ఉన్న భక్తిని చాటుకోవడానికి దేవుడికి ఘనంగా పూజలు చేయడం దానధర్మాలు చేయడం బంగారు పట్టు వస్త్రాలన్న సమర్పించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే దేవుడిపై భక్తి ఉండాలి కానీ మరీ ప్రాణాలు తీసుకునేంత భక్తి ఉండకూడదు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక భక్తుడు మాత్రం ఏకంగా దేవుడు కోసం తన శిరస్సును సమర్పించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. శివుడి భక్తిలో మునిగిపోయిన ఒక భక్తుడు దేవుడు కోసమని తన తలను సమర్పించేందుకు ప్రయత్నించాడు. 28 ఏళ్ల దీపక్ కుష్వాహ వుడ్ కట్టర్ మెషీన్లో తల పెట్టాడు. తన తలను శివునికి అంకితం చేయాలనుకుని కట్టర్ మెషీన్లో పెట్టగానే కేకలు వినిపించాయి. దీంతో స్థానికులు ఆ కట్టర్ మిషన్ లో నుంచి యువకుడిని బయటకు తీశారు. అయితే యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన లలిత్పూర్ జిల్లా సదర్ కొత్వాలి ప్రాంతంలోని రఘునాథ్పురా గ్రామంలో జరిగింది.
ఈ ఘటనపై యువకుడి కుటుంబ సభ్యులకు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. యువకుడికి బలమైన గాయాలయ్యాయని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో యువకుడి మెడ నుంచి చాలా రక్తం పోయింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు ముందు యువకుడు ఒక లేఖ రాశాడు. అందులో తన తలను నరికి శివుడికి, విష్ణువుకు అంకితం ఇస్తానని రాశాడు.