తమిళనాడులో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయాలు వేడెక్కాయి. హంగ్ ఏర్పడటంతో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే, తన పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో మూకుమ్మడిగా రాజీనామా చేయించాలని విజయ్ నిర్ణయించినట్లు సమాచారం.
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ విజయ్ రెండుసార్లు గవర్నర్ను కలిసినప్పటికీ సానుకూల స్పందన రాలేదు. మరోవైపు, తిరిగి ఎన్నికలు రాకుండా సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డీఎంకే సమావేశమై తీర్మానించింది. ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకే, అన్నాడీఎంకే చేతులు కలిపే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని టీవీకే వర్గాలు అనుమానిస్తున్నాయి.
ప్రజల మద్దతు తమకే ఉందని, ప్రభుత్వ ఏర్పాటు అవకాశం కూడా తమకే దక్కాలని విజయ్ భావిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా ఆ రెండు పార్టీలు కలిస్తే, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయడమే సరైన చర్య అని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆయన పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ పరిణామంతో తమిళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
