Nara Lokesh : వైసీపీ పాలనలో నెలకొన్న అరాచకతపై ప్రజలలో చైతన్యం నింపేందుకు యువనేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర విశేషాలను “ది వాయిస్ ఆఫ్ పీపుల్” పుస్తకావిష్కరణ తెలుగుదేశం మహానాడు వేదికపై జరగింది. ఈ కార్యక్రమంలో పుస్తకపు తొలి ప్రతిని లోకేశ్ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడికి అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పుస్తకాన్ని పరిశీలించి లోకేశ్ను అభినందించారు. 2023 జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి దేవాలయం వద్ద నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర, మొత్తం 226 రోజులపాటు సాగింది. ఈ యాత్ర ద్వారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా 3,132 కిలోమీటర్ల దూరం నడిచారు. పాత 11 జిల్లాల్లోని 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీల మీదుగా 2,097 గ్రామాలను సందర్శించారు. పాదయాత్రలో భాగంగా ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం అణిచివేతకు పాల్పడిన అనేక సందర్భాల్లో కూడా లోకేశ్ తన ప్రయాణాన్ని ఆపలేదు.
Read Also: Mock Drill : పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్..!
ఈ పుస్తకంలో పాదయాత్రలో ఎదురైన ప్రతి ఒక్క అనుభవాన్ని సచిత్రంగా వివరించారు. ప్రతి అడుగులో కూడా వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిన తీరును, ప్రజలు పడిన బాధలను, అధికార కక్షసాధింపులను వివరించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న రైతులు, యువత, మహిళలు, వృద్దుల గాథలను కలకళ్లభరితంగా చిత్రీకరించారు. పుస్తకాన్ని చదువుతుంటే, ఆ సమయంలో పాదయాత్రలో ఎదురైన సంఘటనలు కళ్లముందు కదలాడతాయనిపిస్తుంది. పుస్తకాన్ని ఆసక్తిగా తిలకించిన చంద్రబాబు మాట్లాడుతూ ..”లోకేశ్ చేసిన యువగళం పాదయాత్ర రాష్ట్ర ప్రజల్లో విశేష స్పందన తెచ్చింది. ఆ పాదయాత్రలో ప్రజల బాధలను నేరుగా చూసి, వినడం ద్వారా సమస్యలపై లోకేశ్కు లోతైన అవగాహన వచ్చింది. ఆ అనుభవాలను పుస్తకంగా తీసుకురావడం ద్వారా రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇది కేవలం పాదయాత్ర కాదు, ప్రజల హక్కుల కోసం సాగిన ఉద్యమయాత్ర” అని ప్రశంసించారు.
‘ది వాయిస్ ఆఫ్ పీపుల్’ పుస్తకం త్వరలోనే ప్రజల ముందుకు రానుంది. పాదయాత్రలోని చరిత్రాత్మక ఘట్టాలు, రాజకీయ మలుపులు, వైసీపీ పాలనలో ఎదురైన అణచివేతలు, ప్రజా జీవితాలపై అవి చూపిన దుష్ప్రభావాలను వెలుగులోకి తీసుకొస్తూ ఈ పుస్తకం వినూత్నంగా నిలవనుంది. యువనేతగా లోకేశ్ చేసిన ప్రయత్నాలకు ఇది దృఢమైన ఆధారంగా నిలుస్తుందనే భావన మహానాడు వేదికపై ప్రతిస్పష్టంగా వ్యక్తమైంది.