Site icon HashtagU Telugu

Sanjay : ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court notices to former AP CID chief Sanjay

Supreme Court notices to former AP CID chief Sanjay

Sanjay : సుప్రీంకోర్టు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. అగ్నిమాపక విభాగంలో డీజీగా పనిచేసిన సమయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ సంజయ్‌పై ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో సంజయ్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఉన్నత న్యాయస్థానం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ అమానుతుల్లా, జస్టిస్‌ పి.కె. మిశ్రా ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది.

Read Also: Sunita Williams : భారత్‌కు సునితా విలియమ్స్.. ఇస్రోతో కలిసి పనిచేయనున్నారా ?

కాగా, వైసీపీ సర్కార్ హయాంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా ఉన్న సంజయ్ భారీ ఎత్తున అవినీతి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా సంజయ్‌ , ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా , ఏ3గా క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ సంస్థ అధినేతలపై ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

ఇక, వేర్వేరు అభియోగాలపై ఇప్పటికే సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. నిబంధనల ఉల్లంఘన, క్రమశిక్షణ రాహిత్యంపై వివరణ ఇవ్వాలని డిసిప్లినరీ ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తూ సీఎస్‌ విజయానంద్‌ ఆదేశాలు జారీ చేశారు. అభియోగాలపై నెలలోపు వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంజయ్‌ అధికార దుర్వినియోగంపై విచారణ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రాజకీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించింది. అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు సంజయ్‌ పై ఆరోపణలు ఉన్నాయి. ట్యాబ్‌ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని, అగ్ని మొబైల్‌ యాప్‌ను తనకు తెలిసిన సంస్థకు కట్టబెట్టారని అభియోగాలు నమోదయ్యాయి.

Read Also: Medicine Price : 900 రకాల మెడిసన్ ధరలను సవరించిన కేంద్రం..