Rahul Gandhi : పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన నేపధ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ కీలక నేతలు ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆదివారం వేరుగా ప్రధానికి లేఖలు రాశారు.
Read Also: Anam Ramaranayana Reddy : పాకిస్థాన్కు భారత్తో యుద్ధం చేసే సత్తా లేదు : మంత్రి ఆనం
భారత ప్రభుత్వం పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన తరిగిన మరుసటి రోజే ఈ డిమాండ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ గాంధీ తన లేఖలో, “పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ వంటి అంశాలపై దేశ ప్రజలకు పారదర్శకంగా చర్చ జరగాలి. ఇది ప్రజాస్వామ్యంలో అత్యవసరం. ప్రతిపక్షాల ఏకగ్రీవ అభ్యర్థన మేరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు తక్షణమే ఆహ్వానం ఇవ్వాలి” అని పేర్కొన్నారు. ఆయన లేఖలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కాల్పుల విరమణను తొలిగా ప్రకటించారని ప్రస్తావించారు.
ఖర్గే కూడా అదే విషయాన్ని బలంగా పేర్కొంటూ, గత ఏప్రిల్ 28న కూడా ఇదే డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. “ఇప్పటి పరిస్థితులలో పార్లమెంట్ చర్చ అనేది అత్యవసరం. ఈ పరిణామాలు దేశ భద్రత, ప్రాదేశిక సమతౌల్యాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాయి. ప్రతిపక్షాల సమ్మతి మేరకు, మీ వెంటనే స్పందనను కోరుతున్నాను” అని ఖర్గే అన్నారు.
ఇక అంతర్జాతీయంగా, భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించగా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ప్రకటనకు మద్దతుగా స్పందించారు. ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో, “ఇరు దేశాల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం, పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించినందుకు హర్షించుతున్నాను. ఇరు దేశాలు బాధ్యతతో వ్యవహరించాయి” అని వ్యాఖ్యానించారు.