Shubhanshu Shukla : జూన్‌ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర..ఇస్రో ప్రకటన

ఈ అంతరిక్ష ప్రయాణం ‘యాక్సియం-4’ (Axiom-4) మిషన్‌ కింద నిర్వహించబడుతోంది. అమెరికాలోని ప్రముఖ వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్‌’ ఈ మిషన్‌కు నాయకత్వం వహిస్తున్నది.

Published By: HashtagU Telugu Desk
Shubhamshu Shukla's space mission on June 19th.. ISRO announcement

Shubhamshu Shukla's space mission on June 19th.. ISRO announcement

Shubhanshu Shukla : భారత యువ వ్యోమగామి శుభాంశు శుక్లా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అంతరిక్ష ప్రయాణానికి ఆఖరికి కొత్త తేదీ ఖరారైంది. సాంకేతిక సమస్యల కారణంగా అనేకసార్లు వాయిదా పడిన ఈ రోదసి యాత్ర జూన్ 19న జరగనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధికారికంగా ప్రకటించింది. ఈ అంతరిక్ష ప్రయాణం ‘యాక్సియం-4’ (Axiom-4) మిషన్‌ కింద నిర్వహించబడుతోంది. అమెరికాలోని ప్రముఖ వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్‌’ ఈ మిషన్‌కు నాయకత్వం వహిస్తున్నది. ఇందులో భారత్, అమెరికా (నాసా), ఐరోపా (ESA) సంస్థల భాగస్వామ్యం ఉందన్న విషయం గమనార్హం.

Read Also: Kalpika Ganesh : సినీనటి కల్పికపై మరో కేసు నమోదు

మరో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములతో పాటు శుభాంశు కూడా ఈ ప్రయాణంలో భాగమవుతారు. ఫాల్కన్-9 రాకెట్‌ సహాయంతో ఈ స్పేస్ క్యాప్సూల్‌ను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇందులో శుభాంశు శుక్లా మిషన్ పైలట్‌ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇది శుభాంశుకు మొదటి అంతరిక్ష ప్రయాణం కావడం విశేషం. ఈ మిషన్‌ ప్రారంభ తేదీ తొలుత మే 29గా నిర్ణయించబడింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడం, టెక్నికల్ లోపాలు తలెత్తడం వంటి సమస్యల కారణంగా అనేకసార్లు వాయిదా పడింది. ముఖ్యంగా జూన్ 11న రాకెట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అయిన విషయం గుర్తించడంతో ప్రయోగాన్ని మరోసారి ఆపివేయాల్సి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆ సమస్యను ఇస్రో సాంకేతిక నిపుణులు పూర్తిగా పరిష్కరించారని తెలియజేశారు.

ఈ ప్రయోగం జూన్ 19న ప్రారంభమైతే, భూమి నుంచి బయలుదేరిన 28 గంటల తర్వాత వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో అనుసంధానం కానుంది. ఈ యాత్ర మొత్తం 14 రోజులపాటు కొనసాగనుంది. ఈ సమయంలో శుభాంశు బృందం అంతరిక్షంలో భారరహిత పరిస్థితుల్లో పలు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. అంతేకాదు, శుభాంశు తన మిషన్ సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడనున్నారన్న విషయం ఇప్పటికే అధికారికంగా వెల్లడించబడింది. అంతేకాకుండా, పాఠశాల విద్యార్థులతో కూడిన ప్రత్యేక సంభాషణలూ జరగనున్నాయి. ఈ చర్యలు యువతలో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంచే విధంగా ఉండనున్నాయి. భారత అంతరిక్ష ప్రస్థానంలో శుభాంశు శుక్లా ఈ మిషన్‌తో కొత్త మైలురాయిని చేరుకోనున్నారు. ఇది భవిష్యత్ భారత వ్యోమగాములకు ప్రేరణనిచ్చే ప్రయాణంగా నిలిచే అవకాశముంది.

Read Also: Gaddar Foundation : గద్దర్ ఫౌండేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు

 

  Last Updated: 14 Jun 2025, 02:32 PM IST