Rs 2000 Note Ban : అలా మొదలై.. ఇలా ముగిసింది

రూ. 2,000 నోట్ల రద్దు (Rs 2000 Note Ban) .. ఇది అకస్మాత్తుగా వచ్చిన ప్రకటనలా కనిపిస్తుండొచ్చు.. వాస్తవానికి దానికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు మాత్రం 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నుంచే వెలువడటం మొదలైంది.

  • Written By:
  • Updated On - May 20, 2023 / 11:28 AM IST

రూ. 2,000 నోట్ల రద్దు (Rs 2000 Note Ban) .. ఇది అకస్మాత్తుగా వచ్చిన ప్రకటనలా కనిపిస్తుండొచ్చు.. వాస్తవానికి దానికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు మాత్రం 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నుంచే వెలువడటం మొదలైంది. ఎందుకంటే ఆ ఏడాదిలో ఒక్కటంటే ఒక్క రూ. 2,000 నోటును కూడా ఆర్బీఐ ప్రింట్ చేయలేదు. అంతకుముందు 2016-17 సంవత్సరంలో రూ. 354.29 కోట్లు, 2017-18 సంవత్సరంలో రూ. 11.15 కోట్లు, 2018-19 సంవత్సరంలో రూ. 4.66 కోట్లు విలువైన రూ. 2000 నోట్లను ప్రింట్ చేసి రిలీజ్ చేశారు. 2021 సంవత్సరం ప్రారంభం నుంచి రూ. 2000 నోటు ఏటీఎంలలో కనిపించకుండా పోయింది. దీంతో ప్రభుత్వం నుంచి మళ్లీ ఏదో పెద్ద ప్రకటన వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంపై అప్పట్లో ఆర్బీఐ క్లారిటీ ఇవ్వలేదు. ప్రకటన చేయలేదు. కానీ ఆ నోట్ల ప్రింటింగ్ ను ఆపేశామని ఒక సమాచార హక్కుచట్టం పిటిషన్‌కు స్పందనగా వెల్లడించింది. రూ. 2000 నోట్ల స్థానంలో కొత్త రూ. 50, రూ. 200 నోట్ల ముద్రణను క్రమంగా పెంచినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఏటీఎంలలో ఒక్కో వ్యాల్యూ కలిగిన నోటును పెట్టడానికి ఒక్కో స్లాట్ ఉంటుంది. రూ. 2వేల నోటును పెట్టడానికి కూడా ఒక స్లాట్ ఉండేది. అయితే దాన్ని 2020 సంవత్సరం ఆరంభం నుంచి విడతల వారీగా ఏటీఎంల నుంచి తీసేశారని.. దాని స్థానంలో కొత్త రూ. 100 నోట్ల స్లాట్ లు పెట్టారని అప్పట్లో ప్రచారం జరిగింది. రెండు వేల నోట్లను ఇకపై ఏటీఎంలలో లోడ్‌ చేయవద్దని అప్పట్లోనే బ్యాంకు అధికారులకు ఆదేశాలు అందాయని ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

2వేల నోట్ల రద్దుకు కారణాలేంటి .. ?

పెద్ద నోట్ల వల్ల బ్లాక్‌మనీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. దీంతోపాటు నకిలీ కరెన్సీ పెరుగుతుందన్న ఆందోళన వినిపించింది.
ఎక్కువ విలువ కలిగిన నోట్ల వల్ల డబ్బును దాచుకోవడం ముఖ్యంగా బ్లాక్‌కు మళ్లించడం సులభమవుతుంది. లాకర్లలో పెద్ద మొత్తంలో డబ్బును దాచుకోవచ్చు. అలా చేయడం వల్ల మార్కెట్‌లో క్యాష్‌ ఫ్లో తగ్గిపోతుంది. దీన్ని అడ్డుకోడానికే ప్రభుత్వం 2వేల నోట్ల రద్దు (Rs 2000 Note Ban) దిశగా నిర్ణయం తీసుకొని ఉండొచ్చని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సహజంగానే పెద్ద నోట్లన్నీ ఆగిపోయి వాటి స్థానంలో చిన్ననోట్ల చలామణి పెరుగుతుందన్నారు. దీనివల్ల బ్లాక్‌మనీతో పాటు, క్యాష్‌ఫ్లో సమస్య కూడా పరిష్కారమవుతుందని ఆర్దిక నిపుణులు చెబుతున్నారు. “వంద రూపాయల నకిలీ నోటు ముద్రణకు, రెండు వేల రూపాయల నోటు ముద్రణకు ఖర్చులో కొద్దిపాటి తేడా మాత్రమే ఉంటుంది. కానీ నోట్ల విలువలో భారీ తేడా ఉంటుంది. అలాంటప్పుడు దొంగ నోట్ల తయారీదారుల ఆప్షన్‌ సహజంగా పెద్ద నోటే అవుతుంది. ఇపుడు 2వేల నోటు రద్దు కానుండటం.. నకిలీ నోట్ల ముఠాలకు చెక్ పడినట్టు అవుతుంది ” అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

also read : 2000 Rupee Note: 2000 నోటుపై ఉన్న గాంధీజీ ఫోటో ప్రత్యేకం.. ఆ ఫోటో ఎప్పుడు తీశారో తెలుసా..?

ఆ నోటు వచ్చాక.. 107 రెట్లు పెరిగిన నకిలీ నోట్లు

2015లో రిజర్వు బ్యాంకు మహాత్మా గాంధీ సిరీస్‌-2005లో కొత్త నంబరింగ్‌ సిస్టంతో కూడిన అన్ని డినామినేషన్ల నూతన కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. వీటిలోని సెక్యూరిటీ ఫీచర్లు చాలా స్పష్టంగా కనిపించేవి. దీంతో అసలు నోట్లకు, నకిలీ నోట్లకు మధ్య ఉన్న తేడాలను సాధారణ ప్రజలు సైతం సులభంగా గుర్తించగలిగేవారు. కానీ, పెద్ద నోట్లను రద్దుచేసి రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టిన తర్వాత నకిలీ నోట్ల చలామణి ఏకంగా 107 రెట్లు పెరిగింది. 2016లో దేశవ్యాప్తంగా 2,272 నకిలీ రూ.2 వేల నోట్లు పట్టుబడ్డాయని, 2020లో వీటి సంఖ్య ఏకంగా దాదాపు 2.45 లక్షలకు చేరినట్టు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌లో వెల్లడించింది.

రూ. 2000 నోట్ల రద్దుపై ఆర్బీఐ వివరణ ఇదీ..  

2016 నవంబరు 8న రూ.500 పాత నోట్లను, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.. అయితే ఆ రోజునే రూ.500 కొత్త నోట్లను, రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. కాకపోతే 2016 నవంబరు 10 నుంచి రూ. 2000 నోట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అవి అందుబాటులోకి వచ్చి సరిగ్గా ఆరున్నర ఏళ్ళు అయింది. ఇంతలోనే వాటిని వెనక్కి తీసుకునేంత అవసరం ఏం వచ్చింది ? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో ఉదయిస్తోంది. దీనికి బదులిస్తూ శుక్రవారం ఆర్బీఐ స్పష్టమైన వివరణ ఇచ్చింది. రూ. 2వేల నోట్లలో 89 శాతం 2017 మార్చికి ముందే చలామణిలోకి వచ్చాయని ఆర్బీఐ తన నోటిఫికేషన్‌లో తెలిపింది. వాటి లైఫ్ స్పాన్ (నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు) మాత్రమేనని.. అది త్వరలో పూర్తవుతుందని పేర్కొంది. 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినప్పుడు వెంటనే రూ. 2,000 నోట్లను అందుబాటులోకి తెచ్చామని ఆర్బీఐ గుర్తు చేసింది. అప్పట్లో ప్రజల అవసరాలకు సరిపడా నగదును అతి తక్కువ కాలంలో అందుబాటులోకి తెచ్చే క్రమంలో రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టామని తెలిపింది. గత ఆరున్నర ఏళ్లలో ఇతర డినామినేషన్లు (ఇతర నోట్లు) సరిపడా అందుబాటులోకి వచ్చాయని, కాబట్టి రూ.2,000 నోటు అవసరం పూర్తయిందని (Rs 2000 Note Ban) ఆర్బీఐ స్పష్టం చేసింది. 2018- 19లోనే రూ.2,000 నోట్ల ముద్రణను నిలిపి వేసినట్టు వెల్లడించింది.