50 Years Imprisonment : రూ.100 కోట్లు కాదు.. రూ.500 కోట్ల కాదు.. ఏకంగా రూ.66 వేల కోట్ల (8 బిలియన్ డాలర్లు) మేర అతడు జనానికి కుచ్చుటోపీ పెట్టాడు. ‘ఎఫ్టీఎక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్’ను ఏర్పాటుచేసి అంతగా ప్రజలను ముంచేశాడు అమెరికాకు చెందిన 32 ఏళ్ల శామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్. ఇంత చిన్న వయసులో ‘ఎఫ్టీఎక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్’ను పెట్టేసి అతగాడు అపర కుబేరుడు అయ్యాడు. క్రిప్టో కింగ్గా మన్ననలు అందుకున్నాడు. అయితే తన ‘ఎఫ్టీఎక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్’లోకి జనం పంపే డబ్బును అతడు దుర్వినియోగం చేశాడు. సొంత అవసరాలకు వాడుకున్నాడు. ఇతర వ్యాపారాల్లోకి పెట్టుబడులుగా మళ్లించాడు. పాపం పండి.. చివరకు ఈవిషయం బయటపడటంతో శామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్ బిక్కమొహం వేశాడు. దీంతో అమెరికా పోలీసులు అతడిని కటాకటాల వెనక్కి నెట్టారు. దాదాపు గత రెండేళ్లుగా ఈ కేసులను ఎదుర్కొంటున్న శామ్పై న్యాయ విచారణ కంటిన్యూ అవుతోంది.
We’re now on WhatsApp. Click to Join
తాజాగా అతడికి విధించాల్సిన శిక్షపై బాధితులు, అమెరికా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే న్యాయవాదులు కీలకమైన డిమాండ్ చేశారు. ఎఫ్టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్ కు 40 నుంచి 50 ఏళ్ల పాటు జైలు శిక్షను(50 Years Imprisonment) విధించాలని కోర్టును కోరారు. తప్పు చేశానని ఒప్పుకుంటూనే.. తానెవరిని మోసం చేయలేదన్న శామ్ బ్యాంక్మాన్ ఫ్రైడ్ను కఠినంగా శిక్షించాలని రిక్వెస్ట్ చేశారు. ‘ఎఫ్టీఎక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్’కు చెందిన కస్టమర్లను రూ.66వేల కోట్ల మేర మోసగించిన వ్యవహారంతో ముడిపడిన ఆధారాలను న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. గత ఏడాది నవంబర్లో ఎఫ్టీఎక్స్లో జరిగిన మోసాలపై అమెరికా న్యాయ స్థానం ఫ్రైడ్ను దోషిగా తేల్చింది. కుట్ర, మనీ ల్యాండరింగ్, మోసంతో పాటు మొత్తం ఏడు రకాల కేసులు నమోదు చేసింది.
ఈ కేసులో ఈ ఏడాది మార్చి 28 నుంచి శామ్ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.అయితే, ఫ్రైడ్ న్యాయవాదులు మరో రకమైన వాదన చేశారు. ప్రైడ్ ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించాలని కోరారు. మెమోలో తన క్లైయింట్ (ప్రైడ్) నాడీ సంబంధిత అనారోగ్య బాధపడుతున్నారని, వాటిని అధిగమించలేకపోతున్నాడని పేర్కొన్నారు. ఇక శామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్ తల్లిదండ్రులిద్దరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సీ ప్రొఫెసర్లు. ఫ్రైడ్ సైతం ఎంఐటి గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. కానీ అత్యాశతో మదుపర్లు తన క్రిప్టో ఎక్స్ఛేంజీలో పెట్టిన పెట్టుబడులతో శామ్ జూదం ఆడినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? మార్చి 28 నుంచి ఫ్రైడ్ జైలు శిక్షను అనుభవిస్తారా? లేదా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.