PM Modi’s Convoy: అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు.. తన కాన్వాయ్ ఆపేసిన మోడీ!!

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.

  • Written By:
  • Publish Date - September 30, 2022 / 11:32 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.
అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం ఏకంగా తన కాన్వాయ్‌ నే కొద్దిసేపు ఆపేశారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు మోదీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను గుజరాత్ బీజేపీ మీడియా విభాగం ట్విట్టర్‌లో షేర్ చేసింది. అహ్మదాబాద్-గాంధీనగర్ మార్గంలో ప్రధాని కాన్వాయ్‌లోని ఎస్‌యూవీలు నెమ్మదిగా ఎడమవైపునకు వెళ్లి అంబులెన్స్‌కు దారి ఇస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. ప్రధాని మోదీ గురువారం నుంచి గుజరాత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని దూరదర్శన్ కేంద్రం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొని గాంధీ నగర్‌లో రాజ్‌భవన్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

శుక్రవారం ప్రధాని గుజరాత్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ తొలి దశతో పాటు గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపారు. గాంధీనగర్- ముంబయి మధ్య వందే భారత్ హైస్పీడ్ రైలు ప్రారంభించిన అనంతరం కాసేపు అందులో ప్రధాని ప్రయాణించారు.
ఈ రోజు సాయంత్రం బనస్కాంత జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడి ప్రముఖ అంబాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన బీజేపీ సర్కారు పూర్తిచేసి ప్రారంభోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల కోసం ప్రధాని నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో తరుచూ పర్యటిస్తున్నారు.

వందే భారత్ హైస్పీడ్ రైలు ప్రత్యేకతలు..

గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ హైస్పీడ్ రైలు నడుస్తుంది. ఇది అక్టోబరు 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు నడవనుంది. ఈ మార్గంలో టికెట్ కనిష్ఠ ధర రూ.1385, గరిష్ఠ ధర రూ. 2505గా ఉంది. కాగా.. దేశంలో ఇది మూడో వందే భారత్‌ రైలు. 2019లో తొలి వందే భారత్‌ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. న్యూడిల్లీ – వారణాసి మార్గంలో హైస్పీడ్ రైలు ప్రారంభించగా.. న్యూఢిల్లీ – శ్రీ మాతా వైష్ణోదేవి మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు.