New Year -Banned : ఈసారి నూతన సంవత్సరం వేడుకలను జరుపుకోకూడదని పాకిస్తాన్ నిర్ణయించింది. ఈమేరకు దేశ ప్రజలకు తాత్కాలిక ప్రధానమంత్రి అన్వరుల్ హక్ కకర్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల దారుణ స్థితిలో జీవనం గడుపుతున్న గాజా ప్రజలకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలపై బ్యాన్ ఉంటుందని.. ఎవరూ వేడుకలను నిర్వహించకూడదని ఆయన స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం మొదటిరోజున పాలస్తీనియన్లకు సంఘీభావంగా నిలవాలని ప్రజలను అన్వరుల్ హక్(New Year -Banned) కోరారు.
We’re now on WhatsApp. Click to Join.
అక్టోబరు 7న ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో దాదాపు 9,000 మంది పిల్లలు చనిపోయారని అన్వరుల్ హక్ గుర్తు చేశారు. ఇజ్రాయెల్ అరాచకం హద్దులు దాటిందని.. ఇప్పటివరకు చనిపోయిన మొత్తం గాజా పౌరుల సంఖ్య 21వేలు దాటిందని తెలిపారు. పాలస్తీనాలోని గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలలో అమాయక పిల్లల మరణాలు జరుగుతున్నా ఇజ్రాయెల్ దాడులను ఆపకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనియన్లపై సాగుతున్న ఈ మారణహోమంపై యావత్ పాకిస్తాన్, యావత్ ముస్లిం ప్రపంచం తీవ్ర వేదనలో ఉన్నాయన్నారు.
Also Read: Whats Today : మేడిగడ్డకు మంత్రులు.. రూ.584 కోట్ల ‘విద్యాదీవెన’ నిధుల విడుదల
పాలస్తీనాకు పాక్ ఇప్పటికే రెండుసార్లు సహాయక సామగ్రిని పంపిందని, మూడోసారి కూడా సహాయక సామగ్రిని పంపేందుకు సిద్ధంగా ఉన్నామని అన్వరుల్ హక్ వెల్లడించారు. పాలస్తీనాకు సకాలంలో సహాయం అందించేలా జోర్డాన్, ఈజిప్ట్లతో పాకిస్తాన్ చర్చలు జరుపుతోందని ఆయన చెప్పారు. వివిధ గ్లోబల్ ఫోరమ్లలో పాలస్తీనా ప్రజల దుస్థితిని ఎత్తిచూపేందుకు పాకిస్థాన్ ప్రయత్నించిందని, ఇజ్రాయెల్ అరాచకాన్ని అరికట్టేందుకు భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.