Letter from Junior Doctors to the President and Prime Minister : కోల్కతాలో ఆర్జి కర్ మెడికల్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినీ హత్యాచారా ఘటనను నిరససిస్తూ జూనియర్ డాక్టర్లు గత కొన్నిరోజులుగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాము చేసే ఆందోళనలను విరమించి.. విధులకు హాజరుకావాలని సిఎం మమతా బెనర్జీ కోరుతున్నారు. అయితే, వరుసగా మూడోరోజు కూడా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వైద్యులతో చర్చలు జరపడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ప్రధాని నరేందమోడీకి లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ తరఫున రాసిన నాలుగు పేజీల లేఖను ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు సైతం పంపారు.
కేంద్రం జోక్యం తమకు భరోసానిస్తుంది..
అత్యంత కిరాతక దాడిలో బలైపోయిన తమ సహోద్యోగికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తద్వారా రాష్ట్రంలో భయం లేకుండా విధుల్లో పాల్గొని ప్రజలకు సేవలందించగలుగుతామని పేర్కొన్నారు. తమ నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి సంస్థాగత బెదిరింపులు, హింస, విధ్వంసాలు పెరిగాయంటూ పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. ఈ కష్ట సమయంలో కేంద్రం జోక్యం తమకు భరోసానిస్తుందని.. తమ చుట్టూ ఉన్న చీకటి నుంచి బయటపడే మార్గాన్ని చూపుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఈ సమాజానికున్న చెడ్డగుణం ఏమిటంటే?..
గడచిన 12 సంవత్సరాల్లో నిర్భయ వంటి లెక్కలేనన్ని అత్యాచారాలు జరిగాయి. అయితే ఈ సమాజానికున్న చెడ్డగుణం ఏమిటంటే.. వాటన్నింటినీ మరిచిపోయింది’ అని వైద్యులు లేఖలో తెలిపారు. కాగా, నిరసనలను విరమింపజేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గురువారం వైద్యులను చర్చలకు పిలిచింది. చర్చల కోసం మమతాబెనర్జీ రెండు గంటలు వేచి చూశారు. అయినప్పటికీ వైద్యులు చర్చలకు సుముఖత చూపలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో తాను సిఎం పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమేనని మమత ప్రకటించారు.