Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి శిఖర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు, వారి సైనిక కమాండర్లు వరుసగా చేస్తున్న బెదిరింపులపై ఇరాన్ సైన్యం ఘాటుగా స్పందించింది. ఇరాన్ సాయుధ దళాల కేంద్ర ప్రధాన కార్యాలయం ‘ఖాతమ్ అల్-అన్బియా’ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాగారి ఈ మేరకు ఒక కీలక హెచ్చరికను జారీ చేశారు.
క్షణాల్లో దాడులకు సిద్ధం: ఇరాన్ సైన్యం
ఇరాన్ ప్రభుత్వ టీవీలో ప్రసారమైన ప్రకటన ప్రకారం.. ఇస్లామిక్ ఇరాన్పై ఏ చిన్నపాటి దురాక్రమణ జరిగినా ఊరుకోబోమని జోల్ఫాగారి స్పష్టం చేశారు. “మా దళాలు ఇప్పటికే ముందే నిర్ణయించుకున్న లక్ష్యాలపై గురిపెట్టాయి. ఏవైనా దాడులు జరిగితే తక్షణమే పూర్తి శక్తితో విరుచుకుపడతాం” అని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ (జయోనిస్ట్ పాలన)ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “పిల్లల హంతకులకు గతంలో కంటే బలమైన పాఠం నేర్పుతాం” అని హెచ్చరించారు.
Also Read: ఐపీఎల్ 2026.. టాప్ ప్లేస్లో ఉన్న జట్టు ఏదీ?
నిరవధికంగా యుద్ధవిరామం పొడిగింపు
మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ దౌత్యపరమైన ముందడుగు పడింది. పాకిస్థాన్ చేసిన విజ్ఞప్తి మేరకు ఇరాన్తో యుద్ధవిరామాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అర్థరాత్రి ప్రకటించారు. ఇరాన్ నుండి ఒక సమగ్రమైన శాంతి ప్రతిపాదన వస్తుందని అమెరికా ఆశిస్తోంది.
చర్చలపై నీలినీడలు
అయితే యుద్ధవిరామం పొడిగించినప్పటికీ చర్చల ప్రక్రియ మాత్రం అటకెక్కినట్లు కనిపిస్తోంది. ఇస్లామాబాద్లో జరగాల్సిన రెండో విడత చర్చలలో పాల్గొనేందుకు టెహ్రాన్ ప్రస్తుతం సుముఖంగా లేదు. ఇరాన్ విముఖత వ్యక్తం చేయడంతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన పాకిస్థాన్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇరాన్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే వరకు చర్చలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని పాక్ సమాచార శాఖ వెల్లడించింది.
