Indian Soldiers – Israel War : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ యుద్ధం మన దేశానికి కూడా చాలా ముఖ్యమైంది. ఎందుకంటే.. భారత్ కు చెందిన దాదాపు 900 మంది సైనికులు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో డ్యూటీలో ఉన్నారు. లెబనాన్ బార్డర్ లో హిజ్బుల్లా మిలిటెంట్ల స్థావరాలు ఉన్నాయి. గత నాలుగు రోజులుగా అక్కడి నుంచి ఇజ్రాయెల్ పైకి కాల్పులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఆర్మీ కూడా హిజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ తరుణంలో లెబనాన్ లో ఉన్న ఐక్యరాజ్యసమితి శాంతి స్థాపనా దళం (UNIFIL) బాధ్యత మరింత పెరిగింది. ఇజ్రాయెల్ – లెబనాన్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చడంపై ప్రత్యేక ఫోకస్ తో ఈ దళం పనిచేస్తోంది. ఇందులో అత్యధికంగా 900 మంది భారత సైనికులు ఉన్నారు.
ఇక్కడ ఒకచోటే కాదు.. సిరియా బార్డర్ లోని గోలన్ హైట్స్ వద్ద కూడా ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపనా దళం ఉంది. అందులోనూ మన ఇండియన్ సైనికులు 200 మంది ఉన్నారు. ఒకవేళ లెబనాన్ – ఇజ్రాయెల్, సిరియా – ఇజ్రాయెల్ మధ్య సైనిక ఘర్షణలు తీవ్రరూపు దాలిస్తే ఐక్యరాజ్యసమితి శాంతి స్థాపనా దళాలు జోక్యం చేసుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాయి. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ట్రై చేస్తాయి. అందుకే అక్కడున్న ఐక్యరాజ్యసమితి దళాలలోని భారత సైనికుల భద్రతపై భారత్ ప్రస్తుతం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
భారత సైనికులు ఇప్పటికిప్పుడు లెబనాన్ – ఇజ్రాయెల్ బార్డర్ కు, గోలన్ హైట్స్ కు వెళ్లలేదు. 1978 నుంచే భారత సైనికులు ఐక్యరాజ్యసమితి శాంతి స్థాపనా దళాల్లో భాగంగా అక్కడ పనిచేస్తున్నాయి. ఆఫ్రికాలోని చాలా సమస్యాత్మక దేశాలలోనూ వేలాదిగా భారత సైనికులు డ్యూటీ చేస్తున్నారు. 1948 సంవత్సరం నుంచే ఐరాస శాంతి పరిరక్షక మిషన్ లో భారత్ కీలక శక్తిగా వ్యవహరిస్తోంది. 2022 సంవత్సరంలో ఐరాస శాంతి పరిరక్షక దళాలకు చెందిన మొత్తం 4207 మంది ప్రాణాలను కోల్పోయారు. వీరిలో ఇండియన్స్ అత్యధికంగా 175 మంది, పాకిస్తానీయులు 166 మంది, బంగ్లాదేశీయులు 160 మంది ఉన్నారు. ఈనేపథ్యంలో ఇజ్రాయెల్, లెబనాన్, సిరియాల్లో పనిచేస్తున్న ఐరాస దళాల్లోని భారత సైనికుల భద్రత ప్రాధాన్యాన్ని (Indian Soldiers – Israel War) సంతరించుకుంది.