Taj Mahal Urs : తాజ్మహల్పైనా పిటిషన్ దాఖలైంది. తాజ్మహల్లో ఏటా నిర్వహించే ఉర్సు వేడుకలను ఈసారి జరపకుండా నిషేధం విధించాలని కోరుతూ అఖిల భారత హిందూ మహాసభ ఆగ్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉర్సు వేడుకలకు హాజరయ్యే ఏటా మూడు రోజుల పాటు ఉచితంగా లోపలికి అనుమతి కల్పించడాన్ని కూడా ఈ పిటిషన్లో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన ఆగ్రా కోర్టు.. దీనిపై మార్చి 4న విచారణ నిర్వహిస్తామని తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 8 వరకు మూడు రోజుల పాటు తాజ్మహల్లో ఉర్సు వేడుకలు(Taj Mahal Urs) జరుగనున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
తాజ్ మహల్లోనే మొఘల్ చక్రవర్తి షాజహాన్ సమాధి ఉంది. ఆయనే యమునా నది ఒడ్డున 1653లో తాజ్ మహల్ నిర్మించారు. షాజహాన్ జనవరి 5న జన్మించగా.. జనవరి 22న చనిపోయాడు. తాజ్ మహల్లో ఏటా నిర్వహించే ఉర్సు వేడుకలు ఈ రెండు తేదీల్లో ఏదో ఒక దానిలో జరగవు. ఈసారి కూడా ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 8 వరకు షాజహాన్ ఉర్సు వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉర్సు నిర్వహించేందుకు ఆగ్రాలోని ముస్లింల ఆధ్వర్యంలో ఒక కమిటీ నడుస్తోంది. ఆ కమిటీని బ్యాన్ చేయాలని అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్ చేస్తోంది.
‘‘తాజ్ మహల్లో ఉర్సు వేడుకలను నిర్వహించుకునేందుకు మొఘలులు కానీ, బ్రిటీష్ ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వం కానీ అనుమతులు ఇవ్వలేదు. మరి ఇప్పుడు మాత్రం అనుమతులు ఎందుకు ఇవ్వాలి ?’’ అని అఖిల భారత హిందూ మహాసభ అధికార ప్రతినిధి సంజయ్ జాట్ ప్రశ్నిస్తున్నారు. సయ్యద్ ఇబ్రహీం జైదీ నేతృత్వంలోని షాజహాన్ ‘ఉర్స్’ సెలబ్రేషన్ కమిటీని ఇప్పటికైనా బ్యాన్ చేయాలన్నారు. తమ న్యాయ పోరాటాన్ని ఆపేది లేదని సంజయ్ స్పష్టం చేశారు. ఏటా ఉర్సు వేడుకల్లో చివరి రోజున 1,880 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ పెద్దదైన ‘చాదర్’ను షాజహాన్ సమాధి వద్ద ముస్లింలు సమర్పిస్తుంటారు. తాజ్ మహల్లో నిర్వహించే మూడు రోజుల ‘ఉర్స్’ వేడుకల్లో మొదటి రోజు ‘చాదర్ పోషి’, రెండోరోజు సందల్, మూడో రోజు గుసుల్ , కుల్ ఆచారాలను నిర్వహిస్తారు. దీనికి పెద్దసంఖ్యలో ముస్లింలు హాజరవుతుంటారు.