Angry Bride: వికటించిన డీజే, ముహూర్తానికి మండపం చేరుకోని వరుడు, కోపం మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న వధువు…

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ వరుడు తన పెళ్లి ఊరేగింపులో స్నేహితులతో కలిసి మందేసి చిందేస్తూ ఒళ్లు మరిచిపోయాడు.

  • Written By:
  • Publish Date - May 17, 2022 / 11:46 PM IST

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ వరుడు తన పెళ్లి ఊరేగింపులో స్నేహితులతో కలిసి మందేసి చిందేస్తూ ఒళ్లు మరిచిపోయాడు. ఏకంగా రాత్రంతా బారాత్ లో డాన్స్ చేస్తూ ఉండిపోయాడు. అమ్మాయి ఇంటికి చాలా లేటుగా చేరుకున్నాడు. కానీ ఆ ఆలస్యానికి వరుడు పెళ్లికొడుకు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. రాత్రి పొద్దుపోయినా ఎంతకీ పెళ్లి కొడుకు ఊరేగింపు రాకపోవడంతో వధువు, కుటుంబసభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. అంతే కాదు తమ కూతురిని మండపంలోని వేరే అబ్బాయితో పెళ్లి చేసి పంపేశారు. అయితే ఊరేగింపుతో పెళ్లికూతరు ఇంటికి చేరుకున్న వరుడు ఆ దృశ్యాన్ని చూసి షాక్ తిన్నాడు. తనకు కాబోయే భార్యను అలా ఎలా వేరే వ్యక్తికి ఇచ్చి పంపేస్తారంటూ గొడవ చేశాడు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు వరుడు తన బంధువుతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అనంతరం పోలీసులు ఇరు కుటుంబాలకు సముదాయించి శాంతింపజేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే చురు జిల్లాలోని చెలానా బాస్ వద్దకు ఊరేగింపుగా తన స్నేహితులతో కలిసి బయలు దేరిన వరుడు, అర్థరాత్రి అయినా డీజే పెట్టుకొని డాన్సులు చేస్తూ మార్గమధ్యంలోనే నిలిచిపోయాడు. ఊరేగింపుగా బయలు దేరిన వరుడు, అతని తరపు బంధువులు ఎవరూ కూడా వధువు ఇంటికి తెల్లవారుతున్నా చేరుకోలేదు. దీంతో వధువు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహించిన వధువు కుటుంబ సభ్యులు ఆమెకు మరో యువకుడితో వివాహం జరిపించి వీడ్కోలు పలికారు. ఇంతలో వరుడు డీజే డ్యాన్సులతో పెళ్లి మండపానికి చేరుకొని షాక్ కు గురయ్యాడు. వరుడి తరపు వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ విషయం అంతా చురు జిల్లా రాజ్‌గఢ్ తహసీల్ చెలానా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 15న హర్యానాలోని సివానీ వార్డు నంబర్ 10లో నివాసముంటున్న అనిల్ కుమారుడు మహావీర్ రాజ్‌గఢ్‌కు చెందిన మంజుతో పెళ్లికి ఊరేగింపుగా వెళ్లాడు.

రాత్రి రెండు గంటలకు వరుడు ఊరేగింపుతో చేరుకున్నాడు
ఊరేగింపు వధువు ఇంటికి చేరుకునే క్రమంలో రాత్రి 9 గంటల ముహుర్తానికి చేరుకోవాల్సిన వరుడు, అర్థరాత్రి వరకు డీజే ట్యూన్‌లకు అనుగుణంగా డాన్సులు చేస్తూ దారిలోనే ఉండిపోయాడు. మద్యం మత్తులో మునిగిపోయిన పెళ్లి కొడుకు అతని స్నేహితులు రాత్రి 2 గంటల వరకు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఊరేగింపు ఎంతకీ ఇంటికి చేరుకోకపోవడంతో వధువు తరఫు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లికూతురు తరఫు వారు ముహూర్తం మించి పోవడంతో పాటు, ఎంత సేపటికీ వరుడు సమయానికి రాకపోవడంతో వధువు, ఆమె కుటుంబ సభ్యులు మరో అబ్బాయితో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అదే మంటపంలో మరో అబ్బాయితో పెళ్లి చేయడంతో పాటు వధువుకు వీడ్కోలు పలికారు.

రాత్రి రెండు గంటల సమయంలో పెళ్లికొడుకు మహావీర్ ఊరేగింపు వధువు ఇంటికి చేరుకోగా, అక్కడి పరిస్థితి చూసి షాక్ తిన్నాడు. వధువుకు మరో యువకుడితో వివాహమైంది. ఆ తర్వాత వీడ్కోలుకు సిద్ధమై వధువు కారులో కూర్చోబోతుండగా, మహావీర్ అక్కడకు చేరుకొని నానా రభస చేశాడు. అయితే ఇరు వర్గాల బంధువులు రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వధువు తరపు బంధువులు పెళ్లి ముహూర్తం విషయంలోనే ఇంత అజాగ్రత్త ఉన్న వ్యక్తి, ఇక భవిష్యత్తులో అమ్మాయిని ఏం చూసుకుంటాడు అంటున్నారు జనాలు. ఈ ఘటన తర్వాత పోలీసులు ఇరువర్గాలను కూర్చోబెట్టి వివరణ ఇవ్వడంతో విషయం సద్దుమణిగింది.