ఉద్యమ గళం మూగబోయింది..ఇక గద్దరన్న గొంతు వినిపించదు. తన పాటలతో , డాన్సులతో హుషారుతెప్పించే గద్దర్ (Gaddar ) ఇకలేరు అనేది యావత్ ప్రజానీకం తట్టుకోలేపోతుంది. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ..అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతున్న గద్దర్..ఆదివారం కన్నుమూశారు.
గద్దర్.. ఈ మాట వింటే ముందుగా గుర్తొచ్చేది ఆయన పాటలు.. ఆయన పాటలే ఆయన్ను గుర్తు చేస్తాయి. ఉద్యమం అంటే చాలు గద్దర పాట ఉండాల్సిందే.. అంతలా ప్రజా జీవితంలో మమేకం అయ్యారు గద్దర్. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948లో దళిత కుటుంబంలో గద్దర్ జన్మించాడు. గద్దర్ అసలు పేరు. గుమ్మడి విఠల్ రావు.
విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా మహబూబ్ నగర్ లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు.
ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర :
గద్దర్ మొదటి నుండి తెలంగాణా వాదే. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమం పునరుద్ధరించడంతో, గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు, నిమ్న కులాల యొక్క ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన మద్దతును తెలుపడం ప్రారంభించారు. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ, అతను ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశం లోని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో తన భావాలను పంచుకోలేదు. మావోయిస్టు పార్టీ తెలంగాణాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా గద్దర్ తెలంగాణకే మద్దతు పలికారు. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణా పార్టీ పెట్టినప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు.
గద్దర్ (Gaddar ) సినీ రంగం :
మాభూమి సినిమాలోని బండెనక బండి కట్టి అనే పాటను గద్దర్ పాడడంతోపాటు ఆ పాటలో నటించాడు. ఆయన రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా” అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణా లోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన “నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ” అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారు. ఆయన మరోసారి
తెలంగాణ ఉద్యమానికి ఊపు తెప్పించిన పాట మన గద్దర్ (Gaddar ) పాడిందే..
జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించాడు. ‘పొడుస్తున్న పొద్దూ’ మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది. ఈ పాట తెలంగాణ ఉద్యమానికే ఊపు తెచ్చింది.
గద్దర్ (Gaddar ) చివరి చిత్రం :
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తీసిన ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాలో గద్దర్ కీలకపాత్ర పోషించారు. ఇదే గద్దర్ నటించిన చివరి సినిమా.
గద్దర్ (Gaddar ) పై కాల్పులు :
గద్దర్ ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తనదైన పాటలతో అందరినీ ఉత్తేజ పరిచేవారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమానికి ఊపుతెచ్చారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. 1997 ఏప్రిల్ 6న నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో గద్దర్పై కాల్పులు జరిగాయి.
మార్కెట్ లో గద్దర్ పాటలకు ఫుల్ డిమాండ్
మార్కెట్ లలో గద్దర్ పాటలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు కాసెట్ లు గా, సిడిలుగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడు పోతుంటాయి.
గద్దర్ శరీరంలో ఓ బుల్లెట్ :-
1997 ఏప్రిల్ 6 న ఆయన పై పోలీసులు విరుచుకు పడ్డారు. ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్ని బుల్లెట్ లను తొలగించారు కాని ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్ లు తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. ఆయన ఒంట్లో బుల్లెట్ ఉంది.
కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి సామాజిక విషయాలపై గద్దర్ (Gaddar ) ప్రచారం :
కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి గద్దర్ బుర్రకథలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఆ తర్వాత ఆయన అనేక పాటలు రాసారు. 1972 లో జన నాట్య మండలి ఏర్పడింది. ఇది పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించెందుకు. దళితులను మేల్కొల్పెందుకు వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది.
1975లో కెనర బ్యాంకులో ఉద్యోగం చేసిన గద్దర్ :
1975లో బ్యాంకు రిక్రూట్ మెంట్ ఎక్సమ్ రాసిన గద్దర్.. కెనర బ్యాంకులో క్లార్క్ గా పనిచేసారు. తర్వాత వివాహం విమల ను పెళ్లి చేసుకున్నారు. దగ్గర దంపతులకు ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు, వెన్నెల ( 2003 లో సూర్యుడు, చంద్రుడు అనారోగ్యంతో మరణించారు).
1984 లో గద్దర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ,1985 లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరి , ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు.
గద్దర్ (Gaddar ) మరణం :
గుండెపోటు కారణంగా 2023 జూలై 20న హైదరాబాద్, అమీర్ పేట్ లోని అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ కు ఆగస్టు 3న వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. తరువాత చికిత్సపొందిన గద్దర్ ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో 2023, ఆగస్టు 6న మధ్యాహ్నం 3 గంటలకు మరణించాడు.
Read Also : ITR Refund: ITR ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ కోసం వేచి చూస్తున్నారా? అయితే స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..?