Farmer Sarpanches : గత కొన్ని రోజులుగా మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆందోళన చేస్తున్నారు. కానీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తాజాగా వారు పోరుబాటకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అరెస్టు చేశారు. కొందరు సర్పంచులు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చారు. సీఎం నివాసం సమీపంలో వారిని పోలీసులు అరెస్టు చేసి.. బొల్లారం పీఎస్కు తరలించారు. అయితే మాజీ సర్పంచ్ల నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి హరీష్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ సర్పంచ్లకు మద్దతుగా తిరుమలగిరి రోడ్డుపై మాజీ మంత్రితో పాటు బీఆర్ఎస్ నాయులు నిరసనకు దిగారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని హరీష్తో పాటు గులాబీ పార్టీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో పోలీస్స్టేషన్ ముందు బైఠాయించి హరీష్రావు నిరసనకు దిగారు. కాగా.. హరీష్రావుతో పాటు మండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ సంజయ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన మాజీ సర్పంచులను విడుదల చేసేదాకా.. పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్లేది లేదని హరీష్ రావు భీష్మించుకు కూర్చున్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మాజీ సర్పంచుల పట్ల కర్కషంగా వ్యవహరించడంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. పోరు తెలంగాణ ఇప్పుడు అరెస్టుల తెలంగాణ, నిర్భంద తెలంగాణ అయ్యిందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పూట దొంగలను, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు మాజీ సర్పంచ్లను అరెస్టులు చేయడం హేయమైన చర్య అన్నారు. సర్పంచ్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. అప్పులు చేసి, భార్య పిల్లల మీద బంగారం అమ్మి పనులు చేశారన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లు ఎంతో కృషి చేశారని తెలిపారు. ఉత్తమమైన గ్రామాలకు తెలంగాణ కేరాఆఫ్ అడ్రస్గా నిలిచిందన్నారు. ప్రధాని అవార్డులు, పంచాయతీ అవార్డులు సాధించిందంటే సర్పంచ్ల పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. మంచి పనులు చేసిన సర్పంచ్లకు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిక్ష వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటిందని.. పది లక్షల బిల్లులు కూడా వారికి చెల్లించలేదన్నారు. నాలుగైదు సార్లు హైదరాబాద్కు వచ్చి మోర పెట్టుకున్నారన్నారు. ముఖ్యమంత్రి లేదా పంచాయతీ శాఖ మంత్రి… సర్పంచ్లను చర్చలకు పిలవాలని.. వెంటనే వారి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ”లక్షా 50 వేల కోట్లతో మూసీ బాగు చేస్తా అంటున్నావు. కానీ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసిన సర్పంచ్లకు ఎందుకు శిక్ష వేస్తున్నావు. సర్పంచ్ల అరెస్టులు పరిష్కారం కాదు, సర్పంచ్ల ఫోన్లు గుంజుకొని టెర్రరిస్టుల లెక్క పోలీసు స్టేషన్లకు తీసుకుపోతున్నారు. మేము వచ్చి వారి బాధలు వినాలని వస్తే వారిని వెంటనే డీసీఎంలలో ఎక్కించి తరలిస్తున్నారు. భట్టి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మాజీ సర్పుంచ్లు ఉన్నారు. నిన్న గాగ మొన్న బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు వీరికి ఎందుకు ఇవ్వడం లేదు. సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వెంటనే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి” అని ప్రభుత్వాన్ని హరీష్రావు డిమాండ్ చేశారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని.. వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. కానీ పేద సర్పంచ్లు పనులు చేసిన పాపానికి శిక్ష అనుభవించాలా అని నిలదీశారు.