Abhishek Manu Singhvi : రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచే ఆయన ఎన్నికయ్యారు. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియగా.. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నేత అయిన అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం కారణంగా పద్మరాజన్ నామినేషన్ ను తిరస్కరించారు. దీంతో రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఆయన తరఫున కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎలక్షన్ ఆఫీసర్ నుంచి సంబంధిత ధ్రువపత్రాన్ని స్వీకరించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, అభిషేక్ సింఘ్వీ సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్నారు. 2001 నుంచి కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. రెండు దఫాలు (2006, 2018)గా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ప్రదేశ్ నుంచి పోటీచేసి బీజేపీ చేతిలో ఓడిపోయారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం స్థానిక నాయకులు కొందరు ప్రయత్నించినా… జాతీయ రాజకీయాల్లో సింఘ్వీ సేవలు కాంగ్రెస్కు కీలకమైనందున ఆయనకే అధిష్ఠానం అవకాశం కల్పించింది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు రాజీనామాతో తెలంగాణలో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా రాజ్యసభలో ఖాళీ అయిన మొత్తం 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అస్సాం, బిహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్సభకు ఎన్నిక అయ్యారు. ఇక తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి పోటీ చేసిన సింఘ్వీ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.