Site icon HashtagU Telugu

Indus Waters Treaty : సింధు జలాల నిలిపివేత ఎఫెక్ట్.. ఎండుతున్న పాక్ డ్యామ్‌లు..సాగునీటి సంక్షోభం, ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం..!

Effect of Indus water stoppage.. Pakistan's dams drying up.. Irrigation water crisis, severe impact on Kharif..!

Effect of Indus water stoppage.. Pakistan's dams drying up.. Irrigation water crisis, severe impact on Kharif..!

Indus Waters Treaty : పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచుతోంది. ఇటీవలి ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగంగా, గతంలో జరిగిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. 1960లో ఇరు దేశాల మధ్య నెహ్రూ-అయూబ్ ఖాన్ నేతృత్వంలో కుదిరిన సింధు జలాల ఒప్పందం అమల్లో మార్పులు రావడంతో పాకిస్థాన్‌లో నీటి కొరత తీవ్రమవుతోంది. ప్రస్తుతం మంగ్లా (జీలం నది) మరియు తర్బేలా (సింధు నది) డ్యామ్‌లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం వల్ల పాకిస్థాన్‌లో వేసవి (ఖరీఫ్) పంటల సాగు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పంజాబ్ మరియు సింధ్ రాష్ట్రాల్లోని వ్యవసాయ రంగానికి ఈ డ్యామ్‌లు ముఖ్యమైన నీటి వనరులుగా ఉన్న నేపథ్యంలో, వాటిలో నీటి మోతాదులు సగానికి తగ్గిపోవడాన్ని పాకిస్థాన్ అధికారులు ఆందోళనతో గమనిస్తున్నారు. సింధు నదీ వ్యవస్థ అథారిటీ (IRSA) నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా నీటి ప్రవాహంలో సగటు 21% తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా చీనాబ్ నది ప్రవాహం అకస్మాత్తుగా తగ్గడంతో ఖరీఫ్ పంటల సాగుపై మరింత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

Read Also: Telangana Formation Day : రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు – సీఎం రేవంత్

ఈ పరిణామాలపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గంభీరంగా స్పందించారు. తాజాగా తజికిస్థాన్‌లోని దుషాన్‌బే నగరంలో జరిగిన ఐక్యరాజ్యసమితి హిమానీనదాల పరిరక్షణ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ఉల్లంఘించిందని ఆరోపించారు. భారత్ చర్యల వల్ల తమ వ్యవసాయరంగం మరియు ప్రజల జీవనాధారం ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ ఆరోపణలను భారత్ స్పష్టంగా ఖండించింది. అదే వేదికపై భారత పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ మాట్లాడుతూ.. ఒప్పంద ఉల్లంఘనకు అసలైన కారణం పాకిస్థాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదమేనని ధ్వజమెత్తారు. “పాక్ ఈ వేదికను దుర్వినియోగం చేయాలని ప్రయత్నించింది. ఇది బాధ్యతారాహిత్యంగా సాగించిన వ్యాఖ్య. భారత్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం,” అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల మధ్య భారత్ యొక్క తాజా నీటి వ్యూహం, పాకిస్థాన్‌పై మానవీయంగా కాకుండా వ్యూహాత్మకంగా ఒత్తిడి తేవడంలో కీలకంగా మారింది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలు మరింత ప్రభావవంతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also: Ukraine : ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి పై జెలెన్‌స్కీ ప్రశంసలు..‘స్పైడర్ వెబ్‌’ ఆపరేషన్‌పై పూర్తి వివరాలు..!