Former Minister Mallareddy : మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవాళ నోటీసులు జారీ చేశారు. పీజీ మెడికల్ కాలేజీ సీట్లు అక్రమంగా విక్రయించారనే అభియోగాలపై మల్లారెడ్డికి ఈడీ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయంపై ఈ రోజు జరిగే విచారణకు హాజరు కావాలని మల్లారెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. దీంతో ఈడీ ఎదుట విచారణకు మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఈడీకి ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం.
కాగా, గత సంవత్సరం జూన్లో మల్లారెడ్డిపై సోదాలు జరిపిన ఈడీ కీలక డాక్యుమెంట్లు, పెన్డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేసినట్లు గుర్తించారు. తెలంగాణలో పలు మెడికల్ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు విక్రయించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. అందులోభాగంగా గతేడాది జూన్లో మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి నివాసం, మెడికల్ కాలేజీతోపాటు కార్యాలయాలపై ఈడీ సోదాలు నిర్వహించింది.
అలాగే 12 మెడికల్ కాలేజీల్లో సైతం సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా కీలక డాక్యుమెంట్లు, పెన్డ్రైవ్లు, హార్డ్డిస్క్లను సైతం ఈడీ స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలోని 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని 45 సీట్లను బ్లాక్ చేసి విక్రయించినట్లు.. ఈడీ తన సోదాల్లో గుర్తించింది. దాంతో దీనిపై వివరణ ఇవ్వాలంటూ మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డితోపాటు వివిధ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా, ఈడీ నోటీసులు మల్లారెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. రాష్ట్రంలో మొత్తం 10 మెడికల్ కాలేజీల్లో 45 సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నట్లు ఈడీ గుర్తించింది.