Life On Mars: మార్స్ పై జీవం ఆనవాళ్లు.. పర్సవరెన్స్ రోవర్ శాంపిల్స్ లో గుర్తింపు!!

ఇతర గ్రహాలపై జీవుల ఉనికి ఉందా? అనేది తెలుసుకునేందుకు నాసా జరుపుతున్న ప్రయోగాల్లో పురోగతి చోటుచేసుకుంది.

  • Written By:
  • Updated On - September 18, 2022 / 08:51 AM IST

ఇతర గ్రహాలపై జీవుల ఉనికి ఉందా? అనేది తెలుసుకునేందుకు నాసా జరుపుతున్న ప్రయోగాల్లో పురోగతి చోటుచేసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో అంగారకుడిపైకి నాసా ” పర్సవరెన్స్” పేరుతో ఒక రోవర్ ని పంపింది. ఇది అంగారకుడిపై జీవానికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించినట్లు తెలుస్తోంది. జెజిరో బిలం వద్ద రోవర్ పురాతన నది డెల్టా నుండి నాలుగు శాంపిల్స్ ను సేకరించింది. పురాతన సూక్ష్మజీవుల జీవితానికి సంబంధించిన ఆనవాళ్లు ఈ శాంపిల్స్ లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సేంద్రీయ రసాయన పదార్ధాలు..

జెజిరో బిలం వద్దనున్న రోవర్ పురాతన నది డెల్టా ప్రాంతంలో సేంద్రీయ రసాయన పదార్ధాలను పర్సవరెన్స్ రోవర్ గుర్తించింది. సేంద్రీయ అణువులు ప్రధానంగా కార్బన్‌తో తయారు చేయబడిన అనేక రకాల సమ్మేళనాలతో పాటు
హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. జెజిరో క్రేటర్ వద్ద ఇసుకరాయి, రాతి శిలలు, బురద రాయిపై పర్సవరెన్స్ పరిశోధనలు చేస్తోంది. ఇందులో సేంద్రీయ రసాయన పదార్థాలు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్త కెన్ ఫార్లే వెల్లడించారు. అయితే వీటిని బట్టి జీవాల ఉనికికి సంబంధించిన స్పష్టతకు రాలేమని అంటున్నారు. ఈ నమూనాలను భూమిపైకి తీసుకువచ్చినప్పుడు మాత్రమే అధ్యయనం చేయవచ్చని చెబుతున్నారు.

అంగారకుడిపై అనువైన వాతావరణం

ఇప్పటి వరకు ఎన్నో గ్రహాలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. అయితే పూర్తిస్థాయి భూమి లక్షణాలు ఉన్న గ్రహాలు మాత్రం వెలుగులోకి రాలేదు. అయితే మన సౌరవ్యవస్థలో భూమి తరువాత జీవాలు నివసించేందుకు అంగారకుడిపై అనువైన వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే అనేక కృత్రిమ ఉపగ్రహాలను, రోవర్లను మార్స్ పైకి పంపారు. మార్స్ ఒకప్పుడు సముద్రాలు, నదులు, సరస్సులను కలిగి ఉండేదని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. ఇప్పటికీ అరుణ గ్రహంపైన సరస్సులు, నదీ ప్రవాహకాలకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. అంతకు ముందు నాసా పంపిన క్యూరియాసిటీ రోవల్, అంగారకుడిపైన గేల్ క్రేటర్ వద్ద పరిశోధనలు సాగిస్తోంది. అక్కడి నమూనాలను విశ్లేషిస్తోంది. గతేడాది పంపిన పర్సవరెన్స్ రోవర్ జెజిరో క్రేటర్ వద్ద పరిశోధనలు జరుపుతోంది.