Delhi Assembly : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గత వారం బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి హోదాలో రేఖా గుప్తా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇక ప్రొటెం స్పీకర్గా అరవిందర్ సింగ్ లవ్లీ ఎన్నికయ్యారు. రాజ్ నివాస్లో అరవిందర్ సింగ్ లవ్లీతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. అంతేకాక.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు.
Read Also: Global Investors Summit : భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం ఆశాభావం: ప్రధాని
ముందుగా సీఎం రేఖా గుప్తా, అనంతరం ఢిల్లీ కేబినెట్ మంత్రులు పర్వేష్ సాహిబ్ సింగ్, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్ ప్రమాణం చేశారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను స్పీకర్గా ఎన్నుకోనున్నారు. కాగా, సమావేశాల రెండో రోజైన (ఫిబ్రవరి 25న) రేపు అసెంబ్లీలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. మూడో రోజైన ఫిబ్రవరి 27న ఉదయం నుంచి గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతుంది. చర్చ ముగిసిన తర్వాత డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తారు.
ఇకపోతే..ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి నేతలంతా ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి ఎన్నికయ్యారు. సమావేశాలకు ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను గౌరవిస్తామని.. ప్రజల గొంతుకగా బాధ్యతను నెరవేరుస్తామని చెప్పారు. తొలి కేబినెట్ సమావేశంలోనే మహిళలకు రూ.2,500 పథకం అమలు చేస్తామని ప్రధాని మోడీ అన్నారని.. ఇదే విషయంపై అసెంబ్లీలో ప్రస్తామని చెప్పారు. హామీల అమలు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పని చేస్తారని గుర్తు చేశారు.
Read Also: Prabhas : తండ్రి చనిపోయిన బాధలో కూడా సాయం చేసిన ప్రభాస్