Miracle Baby: కాసేపయితే ఖననం.. అంతలోనే అలికిడి.. శిశువు బతికే ఉన్నట్టు గుర్తింపు!!

అది శ్మశాన వాటిక.. కాసేపు అయితే ఆ పసికందు అంత్యక్రియలు పూర్తి అవుతాయి.

  • Written By:
  • Publish Date - May 24, 2022 / 09:41 AM IST

అది శ్మశాన వాటిక.. కాసేపు అయితే ఆ పసికందు అంత్యక్రియలు పూర్తి అవుతాయి. ఇంతలో ఓ అలికిడి.. ఖననం చేసేందుకు తవ్విన కందకం వద్ద ఉంచిన శిశువు ఒక్కసారిగా కదిలింది. దీంతో అందరూ ఉలిక్కిపడ్డారు.

పసికందు ప్రాణంతోనే ఉందని ఓవ్యక్తి గుర్తించాడు. ఆ విషయాన్ని అక్కడున్న అందరికీ చెప్పాడు. వెంటనే ఉరుకులు, పరుగులతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. శిశువును పరీక్షించిన వైద్యులు . ప్రాణంతోనే ఉందని తేల్చి చెప్పారు. మెరుగైన చికిత్సను ప్రారంభించారు. ఈ ఘటన కశ్మీర్ లోని బనిహాల్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ సబ్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రి లో సోమవారం చోటుచేసుకుంది. చనిపోయిన పాప పుట్టిందని ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది చెప్పిన మాటలు నమ్మి తాము శిశువును ఖననం చేయడానికి తీసుకెళ్లామని బషారత్ అహ్మద్ దంపతులు చెప్పారు.

ఆస్పత్రి నిర్వాకాన్ని ప్రశ్నించేందుకు బషారత్ అహ్మద్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రి వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. సంబంధిత సిబ్బందిని నిలదీశారు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘటనకు కారకులు అయిన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు శాంతించి వెళ్లిపోయారు. అయితే స్థానిక అధికార యంత్రాంగం మాత్రం వైద్యులను వదిలేసి.. కేవలం జూనియర్ స్టాఫ్ నర్స్, స్వీపర్ లపై సస్పెన్షన్ విధించి చేతులు దులుపుకున్నారు.