CM Revanth Reddy : మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు (బుధవారం) ఆయన రాజధానిలో అడుగుపెట్టనున్నారు. గురువారం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పాల్గొనేందుకే ఆయన హస్తిన వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈసారి సీఎం పర్యటనలో క్యాబినెట్ విస్తరణ అంశం కొలిక్కి వస్తుందని భావిస్తున్న ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అవుతోంది. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో క్యాబినెట్ విస్తరణ జరగలేదు. ఇదే విషయమై అధిష్ఠానంతో చర్చించేందుకు రేవంత్రెడ్డి పలుమార్లు హస్తినకు వెళ్లినా పని కాలేదు.
Read Also: Rape : హైదరాబాద్లో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
అయితే ఈ సమావేశం అనంతరం పార్టీ హై కమాండ్తో సమావేశమై తెలంగాణకు సంబంధించి కీలక విషయాలపై చర్చిస్తారని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా రాష్ట్ర కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతారని సమాచారం. అయితే రేవంత్ కేబినెట్ విస్తరణ గురించి హై కమాండ్తో చర్చించబోతున్నారనే వార్తలు రావడంతో రాష్ట్ర కేడర్లో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. ముఖ్యంగా మంత్రి పదవులపై ఆశపడుతున్న ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురించాయి. విస్తరణ జరిగితే కొత్త మంత్రి పదవులు దక్కించుకునేందుకు కొంతమంది ఇప్పటినుంచే ప్రణాళికలు కూడా రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే నిజానికి హర్యానా ఎన్నికల ముందే రాష్ట్ర కేబినెట్ విస్తరణకు సిద్ధమయ్యారు రేవంత్ రెడ్డి. అయితే పార్టీ అధిష్ఠానం ఫోకస్ అంతా హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికలపై ఉండడంతో అది సాధ్యం కాలేదు. ఇక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఓటమి ఎదురవడంతో అధిష్ఠానం అంతర్మథనంలో పడింది. దీంతో రేవంత్ రెడ్డి కూడా సైలెంట్ అయ్యారు. ఇలాంటి టైంలో సీడబ్ల్యూసీ మీటింగ్ జరగనుండడంతో ఇది మంచి అవకాశంగా భావించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ విషయంపై పార్టీ పెద్దలతో కచ్చితంగా చర్చిస్తారనే మాట వినిపిస్తోంది.