Mahakal Temple: ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని(Ujjain)లోని మహాకాలేశ్వర్ ఆలయం(Mahakal temple)లో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం(Fire accident) జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో సుమారు 14 మంది పూజారులు గాయపడ్డారు. గర్భగుడిలో హోలీ ఆడుతున్న వేళ అగ్నిప్రమాదం సంభవించింది. దీనిపై ఆ రాష్ట్ర మంత్రి కైలాస్ విజయవర్గీయ్ మాట్లాడారు. గులాల్ రంగులో ఉన్న కెమికల్స్ వల్ల అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని ఆయన అంచనా వేశారు.
We’re now on WhatsApp. Click to Join.
సాధారణంగా ప్రతి ఏడాది మహాకాలేశ్వరుడి సన్నిధిలో పూజారులు హోలీ ఆడుతుంటారు. అయితే ఇవాళ ఉదయం 5.50 నిమిషాలకు భస్మహారతి సమయంలో జరిగిన ప్రమాదంలో 14 మంది పూజారులు గాయపడ్డారు. కొందరు సేవకులు కూడా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఇండోర్లో ఉన్న శ్రీ అరబిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నవారి ఆరోగ్యం క్షేమంగా ఉన్నది. కానీ 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉండనున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రతి ఏడాది మహాకాలేశ్వర్ ఆలయంలో హోలీ నిర్వహిస్తారని, గులాల్ చల్లుకుంటూ ఆ సంబరాలు జరుపుకుంటారని, అయితే గులాల్లో ఉన్న ఏదో రసాయనం వల్ల అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని మంత్రి వెల్లడించారు. మహాకాలేశ్వర్ ఆలయంలో హోలీ వేడుకల్ని నిర్వహించే సంప్రదాయాన్ని తాము ఆపబోమన్నారు.
మరోసారి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉండే గులాల్తో ఆడనున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రమాదం పట్ల మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. గాయపడ్డ వారి క్షేమ సమాచారాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి షా అడిగి తెలుసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.