Site icon HashtagU Telugu

Bomb Threat : బాంబు బెదిరింపు.. ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్‌

Air India Flight

Air India Flight

Bomb Threat : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో గురువారం చోటు చేసుకున్న ఘోరమైన విమాన ప్రమాదం నుంచి దేశం ఇంకా కోలుకోకముందే మరో ఆందోళనకరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 265 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశాన్ని విషాదంలో ముంచేసింది. దానిని మరచిపోకముందే, శుక్రవారం మరో విమాన సంఘటన కలకలం రేపింది. ఫుకెట్ (థాయిలాండ్) నుండి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం స్థానిక సమయం 9:30 గంటలకు ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా AI 379 విమానానికి గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మరియు ఎయిర్ ఇండియా సిబ్బంది అత్యవసరంగా విమానాన్ని తిరిగి ఫుకెట్ ఎయిర్‌పోర్ట్‌కి మళ్లించారు.

Read Also: Love Marriage : మారరా.. లవ్ మ్యారేజ్ చేసుకుందని 40 మందికి గుండు.. పెద్ద కర్మ నిర్వహించి..

ఈ విమానం ఎయిర్‌బస్ A320-251N మోడల్‌కు చెందింది. దాదాపు 156 మంది ప్రయాణికులు ఇందులో ఉన్నారు. విమానం తిరిగి ల్యాండింగ్ అయిన వెంటనే అత్యవసర ప్రోటోకాల్‌ ప్రకారం, ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి దించారు. థాయిలాండ్ విమానాశ్రయ అధికారులు (Airports of Thailand – AOT) ఈ సమాచారం అధికారికంగా వెల్లడించారు. ఫ్లైట్‌రాడార్24లో కనిపించిన వివరాల ప్రకారం, విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే అండమాన్ సముద్రం మీదుగా తిరిగి ఫుకెట్ వైపు మళ్లింది. విమానం భద్రతా సిబ్బంది అప్రమత్తంగా స్పందించి ప్రయాణికులను అత్యవసర మార్గాల్లో విమానం నుండి తొలగించారు. అందరినీ భద్రతా గదుల్లోకి తరలించారు.

ప్రస్తుతం బాంబు బెదిరింపు స్వభావం, మూలం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అధికారులు దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి పేలుడు జరగలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎటువంటి గాయాలు సంభవించలేదని AOT వెల్లడించింది. ఈ ఘటన, అహ్మదాబాద్ విమాన ప్రమాదం తరువాత రావడంతో విమాన ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. విమానయాన భద్రతపై మళ్లీ ప్రశ్నలు మొదలయ్యాయి. వరుసగా రెండు రోజుల్లో రెండు విమాన ఘటనలు చోటు చేసుకోవడం వల్ల దేశ వ్యాప్తంగా విమానయాన సంస్థలు అప్రమత్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయాణికుల భద్రతకి మించిన ప్రాధాన్యత ఇంకేదీ ఉండదని ఈ సంఘటనలు మళ్లీ గుర్తు చేస్తున్నాయి.

Read Also: India-China : త్వరలో భారత్‌ నుంచి చైనాకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం