Arvind Kejriwal vacates Delhi Chief Minister official residence: ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీఎం నివాసాన్ని ఖాళీ చేశారు. ఇటీవలే ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన ఈ నివాసాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు కేజ్రీవాల్ సివిల్ లైన్స్ ఏరియాలో 6 ఫ్లాగ్స్టాఫ్ రోడ్లోని ఆ ఇంటి నుంచి శుక్రవారం తన కుటుంబంతో కలిసి బయటకు వచ్చారు. ఇకపై కేజ్రీ తన కుటుంబంతోపాటు ఫిరోజ్షా రోడ్డులో ఉన్న ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో నివాసం ఉండనున్నారు.
సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్ #ArvindKejriwal #aamadmiparty #Delhi #HashtagU pic.twitter.com/lyq8E7DDBG
— Hashtag U (@HashtaguIn) October 4, 2024
Read Also: Hydra : హైడ్రా కూల్చివేతలను ఇప్పటికిప్పుడు ఆపలేం: హైకోర్టు
ఆప్ పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలోని బంగ్లాలో ఇకపై నివాసం ఉండనున్నారు. పంజాబ్కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిత్తల్కు అధికారికంగా కేటాయించిన ఆ భవనం.. ఫిరోజ్షా రోడ్డులో ఉంది. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని, జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలై వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ .. సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆతిశీ నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దాంతో సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్నట్టు ఇటీవల పార్టీ కార్యకర్తలకు కేజ్రీవాల్ వెల్లడించారు. తమ ఇంటికి రావాలని, తమతో ఉండిపోవాలని పలువురు చట్ట సభ్యులు, కార్యకర్తలు ఆయన్ను కోరారు. 2013లో తొలిసారిగా సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన తిలక్ లేన్లో ఉండేవారు. 2015లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఫ్లాగ్స్టాఫ్ రోడ్డులోని ఇంటికి మారారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టయిన కేజ్రీవాల్కు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దీంతో బెయిల్పై బయటకు వచ్చిన కేజ్రీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సమర్పించారు. ఈ క్రమంలోనే సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం కల్పించిన అన్ని సౌకర్యాలను కేజ్రీ వదులుకున్నారు. ఇక కేజ్రీ తర్వాత ఢిల్లీ పగ్గాలు అతిశీ అందుకున్న విషయం తెలిసిందే. నాలుగు నెలల పాటు ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.