Bengaluru cafe blast: బెంగళూరు రామేశ్వరం కేఫ్ (Bengaluru Rameshwaram Cafe) పేలుడు కేసులో మరో ఇద్దరు కీలక నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) తాజాగా అరెస్ట్ చేసింది. బెంగాల్కు చెందిన ముసావీర్ షాజీబ్ హుస్సేన్, అబ్దుల్ మాథీన్ అహ్మద్ తాహాను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.
We’re now on WhatsApp. Click to Join.
పేలుడుకు పాల్పడిన వారిలో ఈ ఇద్దరు ప్రధాన కుట్రదారుల్లో ఒకరుగా ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే గుర్తించారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిద్దరి ఆచూకీ కనిపెట్టేందుకు ఎన్ఐఏ బృందాలు దేశవ్యాప్తంగా తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరి ఆచూకీ కోసం ఎన్ఐఏ రూ.20 లక్షల నగదు బహుమతిని కూడా ప్రకటించింది. ప్రధాన నిందితులైన ముసావీర్ షాజీబ్ హుస్సేన్, అబ్దుల్ మాథీన్ అమ్మద్ తాహాల సమాచారం తెలిపితే ఒక్కొక్కరిపై రూ.10లక్షల వంతున రూ.20 లక్షలను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది. కేఫ్లో ముసావీర్ హుస్సేన్ షాజీబ్ ఐఈడీని అమర్చాడని పేర్కొంది. వీరి సమాచారం తెలిసిన వారు 080-29510900 ఫోన్ నంబర్కు కానీ, info. blr. nia@gov.in ఈ-మెయిల్కు సమాచారం ఇవ్వాలని కోరింది.
బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్లో మార్చి 1 శుక్రవారం బాంబ్ బ్లాస్ట్ (Bomb Blast) ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్కు వచ్చినట్లు గుర్తించారు. కేఫ్లో పేలుడు జరిగిన గంట తర్వాత అనుమానితుడు బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అనుమానితులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.