Abolition of Reservation in India : అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. భారత్ అంటే అన్నీ ప్రాంతాల సమాహారం అని అన్నారు. బీజేపీ మాత్రం అలా చూడటం లేదన్నారు. కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మూడు రోజుల పర్యటన కోసం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. డల్లాస్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో విద్యార్థులు,స్థానిక భారత సంతతి అమెరికన్లతో రాహుల్ ముచ్చటించారు.
అభివృద్ధిలో వారి భాగస్వామ్యం అంతంతమాత్రమే..
ఈ సందర్భంగా ఆయన రిజర్వేషన్ల అంశంపై స్పందించారు. భారత్లోని అన్ని వర్గాల ప్రజలకు సమానమైన, పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చిన తర్వాత రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచన చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని రాహుల్ అన్నారు. అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా అంతంతమాత్రంగా ఉందని పేర్కొన్నారు. కామన్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి)పై ప్రశ్నించగా, దానిపై తాను ఇపుడే స్పందించలేదనని స్పష్టం చేశారు. అమెరికాలో ప్రతిష్టాత్మక జార్జ్ టౌన్ యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
మోడీ ఆలోచనలు వేరు, తన ఆలోచనా విధానం వేరు..
మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీపై తనకు ఎటువంటి ద్వేషం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఆలోచనా విధానాన్ని విభేదిస్తాను తప్పా ఆయన్ను ద్వేషించడం లేదని వివరణ ఇచ్చారు. టెక్సాస్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పై వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ మంగళవారం సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. రాహుల్ మాట్లాడుతూ.. మోడీ ఆలోచనలు వేరు, తన ఆలోచనా విధానం వేరని రాహుల్ వెల్లడించారు. వాస్తవానికి కొన్ని విషయాల్లో ఆయన పట్ల తనకు సానుభూతి ఉందన్నారు. వినడానికి ఇది మీకు ఆశ్చర్యం కలిగించినా, ఇదే నిజం అని అన్నారు. తనకు మోడీ అంటే ద్వేషం లేదని విద్యార్థులకు చెప్పుకొచ్చారు. మోడీ వర్సెస్ రాహుల్ అంటూ పోల్చడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఇదే తన అభిప్రాయమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.