Seized Ship: ఇజ్రాయెల్(Israel)పై దాడికి ఒక రోజు ముందు ఇరాన్(Iran) స్వాధీనం చేసుకున్న కార్గో షిప్(Cargo ship)లో ఉన్న 17 మంది భారతీయ సిబ్బంది(17 Indian personnel)ని కలిసేందుకు భారత ప్రభుత్వ అధికారులకు అనుమతి లభించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రంగంలోకి దిగి ఇరాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ అబ్దుల్లాహియాన్తో ఫోన్లో మాట్లాడి ఈ విషయాన్ని ఖరారు చేశారు. సీజ్ చేసిన నౌకకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే భారత ప్రభుత్వ ప్రతినిధులు నౌకలోని భారతీయ సిబ్బందిని కలవొచ్చని ఆమిర్ చెప్పినట్టు జైశంకర్ వెల్లడించారు. మరోవైపు నౌకలోని సిబ్బందిని విడిపించడంపై కూడా భారత్ దృష్టిపెట్టింది. ఈ విషయాన్ని ఇరాన్తో చర్చించినట్టు జైశంకర్ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆమిర్ అబ్దుల్లాహియాన్తో ఫోన్ లో మాట్లాడానని జైశంకర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఆ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించామని, ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరం కాకుండా సంయమనం పాటించాల్సిన ఆవశ్యకత గురించి గుర్తుచేశానని జైశంకర్ పేర్కొన్నారు. సంప్రదింపులకు అందుబాటులో ఉంటామని ఇరాన్ హామీ ఇచ్చిందని జైశంకర్ వివరించారు.
మరోవైపు శనివారం రోజున నౌకను పట్టుకున్నారు. దాంట్లో ఉన్న సిబ్బందిని అరెస్టు చేశారు. అయితే ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని జైశంకర్ కోరారు. కాగా, ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో హార్ముజ్ జలసంధి సమీపంలో ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ కమాండోలు హెలికాప్టర్ ద్వారా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ నౌకలో 17 మంది భారతీయులు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.