Site icon HashtagU Telugu

Advani 6 Yatras : భారతరత్న అద్వానీ ప్రతిష్ఠను పెంచిన 6 యాత్రలివే..

Advani 6 Yatras

Advani 6 Yatras

Advani 6 Yatras : బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న అందుకోనున్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో లాల్‌ కృష్ణ అడ్వాణీని భిన్నంగా చూపేది ఆయన వ్యక్తిత్వమే. ఉక్కు మనిషిగా పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన అడ్వాణీ రథయాత్రికుడిగా కార్యకర్తల మన్ననలను అందుకున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం తొలిసారి రథాన్ని కదలించిన బీజేపీ అగ్రనేత, ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో వివిధ పేర్లతో రథయాత్ర చేశారు. దేశ రాజకీయ చరిత్రలో తనదైన అధ్యాయాన్ని లిఖించారు. దేశంలోని హిందూ సమాజంలో భారత రత్న అద్వానీ ప్రతిష్ఠను పెంచిన 6 రకాల రాజకీయ యాత్రల విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

సోమనాథ్‌- అయోధ్య రామ రథయాత్ర

అయోధ్యలో రామజన్మభూమి ఆందోళనకు మద్దతు తెలుపుతూ ‘సోమనాథ్‌- అయోధ్య రామ రథయాత్ర’ను అద్వానీ 1990లో నిర్వహించారు. 1990 సెప్టెంబరు 25న దీన్ దయాల్‌ ఉపాధ్యాయ జన్మదినం సందర్భంగా గుజరాత్‌లో ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రను 10వేల కిలోమీటర్లు చేసి.. అక్టోబరు 30న అయోధ్యకు చేరుకోవాలని ఎల్​కే అద్వానీ ప్రణాళికలు వేసుకున్నారు. బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ మినీబస్‌ను రథం రూపంలో డిజైన్ చేయించగా ఆ రథంలోనే అద్వానీ యాత్రను కొనసాగించారు.ఈ క్రమంలో హిందూ, ముస్లింల మధ్య ఉత్తర భారతదేశంలో గొడవలు జరగడం వల్ల అద్వానీపై నాటి వీపీ సింగ్‌ ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. అక్టోబరు 23న బిహార్‌లోని సమిష్టిపుర్‌లో అద్వానీని నాటి బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ అరెస్ట్ చేయించారు. ఫలితంగా అయోధ్యకు చేరకుండానే యాత్ర నిలిచిపోయింది. ఈ యాత్ర ఫలితంగా 1989లో 86గా ఉన్న బీజేపీ ఎంపీల సంఖ్య రథయాత్ర తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో 120కి పెరిగింది.

Also Read : Jharkhand MLAs : హైదరాబాద్​లో జార్ఖండ్‌​ ఎమ్మెల్యేలు.. రంగంలోకి సీఎం రేవంత్.. 300 మందితో భద్రత

జనాదేశ్ యాత్ర

80వ రాజ్యాంగ సవరణ బిల్లు, ప్రజాప్రాతినిథ్య చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకిస్తూ 1993 సెప్టెంబరు 11న అద్వానీ నేతృత్వంలో బీజేపీ జనాదేశ్ యాత్రను నిర్వహించింది. మైసూర్ నుంచి అద్వానీ, జమ్మూ నుంచి భైరాన్ సింగ్ షెకావత్‌, పోర్‌ బందర్‌ నుంచి మురళీ మనోహర్ జోషి, కోల్‌కతా నుంచి కల్యాణ్ సింగ్ ఈ యాత్రను నిర్వహించారు. 14 రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 1993 సెప్టెంబరు 25న భోపాల్‌కు చేరుకున్న ఈ యాత్రలు భారీ ప్రదర్శనగా ముగిశాయి. ఆ రెండు బిల్లులకు పార్లమెంటులో ఆమోదం లభించకపోవడంతో జనాదేశ్ యాత్ర(Advani 6 Yatras) లక్ష్యం నెరవేరింది.

స్వర్ణ జయంతి రథ యాత్ర

దేశ స్వాతంత్య్ర సమరయోధులకు నీరాజనం పట్టేందుకు 1997 మే 18న బీజేపీ స్వర్ణ జయంతి రథ యాత్రను నిర్వహించింది. స్వాతంత్య్ర సంగ్రామంలోని కీలక ఘటనలు, ఉద్యమాలు జరిగిన చారిత్రక ప్రదేశాలమీదుగా ఈ యాత్ర సాగింది. 1997 మే 15 నుంచి 1997 జులై 15 వరకు 4 దశల్లో 59 రోజులు స్వర్ణ జయంతి రథ యాత్ర నిర్వహించారు. 21రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 15 వేల కిలో మీటర్ల మేర స్వర్ణ జయంతి రథయాత్ర సాగింది.

భారత్ ఉదయ్ యాత్ర

1997 నుంచి 2004 వరకూ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి, ఏప్రిల్ నెలల్లో భారత్‌ వెలిగిపోతోందనే అర్థం వచ్చే “భారత్ ఉదయ్ యాత్ర”ను బీజేపీ నిర్వహించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఓటమి పాలుకాగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి విజయం సాధించింది.

భారత్‌ సురక్షా యాత్ర

ఉగ్రవాదులను నియంత్రించడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్‌ విఫలమైందంటూ 2006 ఏప్రిల్ 6న బీజేపీ భారత్‌ సురక్షా యాత్రను చేపట్టింది. దీన్ని రెండు దశలుగా నిర్వహించారు. అద్వానీ గుజరాత్‌లోని ద్వారక నుంచి ఢిల్లీకి, నాటి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒడిశాలోని పూరీ నుంచి ఢిల్లీకి యాత్రను నిర్వహించారు. 6వేల కిలోమీటర్ల మేర అద్వానీ యాత్రను నిర్వహించగా రాజ్‌నాథ్‌ 5 వేల 500 కిలోమీటర్లు నిర్వహించారు.

జన్ చేతన యాత్ర

విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తేవాలనే నినాదంతో 2011 అక్టోబరు 11న బిహార్‌లోని శరణ్ జిల్లాలోని సితాబ్‌ డయారా గ్రామం నుంచి బీజేపీ అగ్రనేత అద్వానీ జన్ చేతన యాత్రను నిర్వహించారు. 7600 కిలోమీటర్లు సాగిన ఈ అవినీతి వ్యతిరేక యాత్ర నవంబరు 20న ఢిల్లీలో ముగిసింది.