Site icon HashtagU Telugu

YSRTP : నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ఆర్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌.. కేసీఆర్ స‌ర్కార్‌పై..?

YS Sharmila

Sharmila

వైఎస్‌ఆర్‌టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈరోజు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆమె గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్నారు. తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఆమె గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం షర్మిల నేరుగా పాదయాత్రకు బయలుదేరనున్నారు. నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా వద్ద మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. షర్మిల పాదయాత్రకు వరంగల్ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. జనవరి 28 నుంచి పాదయాత్ర నిర్వహించేందుకు వైఎస్‌ఆర్‌టీపీ పోలీసుల అనుమతి కోరినప్పటికీ.. 2023 ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 18 వరకు పాదయాత్ర నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. షర్మిల యాత్రకు 15 షరతులు విధించారు పోలీసులు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభించి, సాయంత్రం 7 గంటలకు ముగించాలని వారు ఆమెను కోరారు. ఉమ్మ‌డి వరంగల్ జిల్లాలోని మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ షర్మిల పాదయాత్ర సాగనుంది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభతో పాదయాత్ర ముగుస్తుంది.