లాల్దర్వాజ బోనాల జాతర (Laldarwaja Bonalu) సందర్భంగా హైదరాబాద్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 గంటల పాటు మద్యం దుకాణాలు (Wine Shops) మూసివేయాలని పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. బోనాల సందర్భంగా భద్రతా పరంగా, శాంతి భద్రతల పరిరక్షణ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Caste Census Report: ప్రభుత్వానికి కులగణన నివేదికను సమర్పించిన కమిటీ!
హైదరాబాద్ బోనాల వేడుకలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుగుతాయి. వేలాది మంది భక్తులు లాల్దర్వాజ, మాహంకాళి దేవాలయాలను సందర్శించడానికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈ తరుణంలో మద్యం దుకాణాలు తెరిచి ఉంటే అపశ్రుతులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావించారు. అందువల్ల ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా ఈ వైన్స్ బంద్ నిర్ణయం తీసుకున్నారు.
బోనాల సందర్భంగా విధించిన నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయించే దుకాణాలు, బార్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీసులు హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పోలీస్ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పోలీసు శాఖ, ప్రజల సహకారంతో బోనాల పండుగను విజయవంతంగా నిర్వహించాలని కోరుతున్నారు.