మునుగోడు నియోజకవర్గానికి చేదువార్త. ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడులో మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఎన్నికల కోడ్ దృష్ట్యా నియోజకవర్గ వ్యాప్తంగా నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు వైన్ షాపులు బంద్ చేస్తున్నట్లు నల్గొండ జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల అధికారుల సూచనల మేరకు నియోజకవర్గంలోని వైన్ షాపులను నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని.. నియోజకవర్గంలోని మొత్తం 7 మండలాల్లో 128 మంది ఎక్సైజ్ సిబ్బంది పనిచేస్తున్నారని సంతోష్ తెలిపారు.
వీరంతా వైన్షాపుల్లో మద్యం విక్రయాలపై నిఘా పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రెండు బైకులు, 2705 లీటర్ల మద్యం సీజ్ చేసి 118 కేసులు నమోదు చేసినట్టు ఆయన వివరించారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది.
Also Read: Public Meeting Cancelled: మునుగోడులో బీజేపీ బహిరంగ సభ రద్దు.. కారణమిదే..?
ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు నడుస్తున్నాయి. ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు విపరీతంగా ఖర్చు చేసి ఓటర్లకు కావాల్సినవి ఇస్తున్నారు. డబ్బులు, మద్యం, ఆహారం అందజేస్తుండటంతో ఓటర్లు సంబరాలు చేసుకుంటున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 5 లక్షల 59 వేలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న.. అభ్యర్థుల ప్రచారం నవంబర్ 1న ముగియనుంది. నవంబర్ 6న ఫలితాలు వెలువడనున్నాయి.