TPCC Chief : తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎన్నుకునేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఈ కీలకమైన పదవిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త జీవం వచ్చింది. గెలుపు దిశగా అడుగులు పడ్డాయి. జనంలోకి కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లడంలో రేవంత్ కీలక పాత్ర పోషించారు. ఎడమొహం, పెడమొహంగా ఉన్న కీలక సీనియర్ నేతలను సైతం కలిసి ముందుకు నడిచేలా చేసిన నాయకత్వ పటిమ రేవంత్ సొంతం. ప్రస్తుతం సీఎం హోదాలో రేవంత్ బిజీగా మారడంతో.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవిని మరొకరికి అప్పగించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలపై, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై సీఎం రేవంత్ పూర్తిస్థాయిలో ఫోకస్ చేయడానికి వీలు కలుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join
అయితే కాబోయే తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరు ? అనే దానిపై ఇప్పుడు కాంగ్రెస్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. 2021 జూన్ 26 నుంచి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికార పీఠంపైకి ఎక్కించిన సీఎం రేవంత్ సూచించే వారికే ఈ కీలక పదవి దక్కొచ్చనే టాక్ వినిపిస్తోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఆ వెంటనే టీపీసీసీ చీఫ్ నియామకం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అధిష్టానంతో దగ్గర సంబంధం ఉన్న నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
కొత్త పీసీసీ చీఫ్గా ఎవరైనా ఒక సీనియర్ నేతకు అవకాశం దక్కుతుందని అంటున్నారు. ఈ పదవికి పోటీ పడుతున్న వారిలో మంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్, మాజీ ఎమ్మెల్యే సంపత్, మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ వంటి ప్రముఖ నేతలు ఉన్నారు. అయితే అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ సమన్వయంతో నడవాలంటే రేవంత్ రెడ్డికి సహకరించే వ్యక్తినే పీసీసీ చీఫ్ గా నియమిస్తారని తెలుస్తోంది. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలతో రేవంత్ కున్న సంబంధాల దృష్టా ఈ ఎంపికలో రేవంత్ పాత్ర ప్రముఖంగా ఉండొచ్చని చెబుతున్నారు.