Telangana: మల్కాజిగిరి అంటే మైనంపల్లి, మైనంపల్లి అంటే మల్కాజిగిరి అనే ఫీలింగ్ మల్కాజిగిరి ప్రజల్లో, టీఆర్ఎస్ నాయకుల్లో కల్పించేందుకు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కృషి చేశారనడంలో సందేహం లేదు. అయితే ఇటీవలి చోటు చేసుకున్న పరిణామంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు.
మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు రోహిత్కు బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎమ్మెల్యే సీటును ప్రకటించనందుకు మంత్రి హరీశ్రావుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడారు. మల్కాజిగిరి ప్రజలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మల్కాజిగిరి ప్రజలకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానని, వారికి అన్నివిధాలా అండగా ఉంటానని అన్నారు.
ఇదిలా ఉండగా మైనంపల్లి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే మైనంపల్లి కోసం బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు పార్టీలోనే ఉంటారా, లేక మైనంపల్లి కోసం పార్టీకి రాజీనామా చేస్తారా..? అనేది మల్కాజిగిరి వాసులు, ప్రతిపక్ష పార్టీల నేతల మదిలో మెదులుతున్న పెద్ద ప్రశ్న. రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.