R.Krishnaiah: దేశవ్యాప్త బీసీ ఉద్యమానికి తెలంగాణ నుంచే శంఖారావం పూరిస్తున్నాం: ఆర్. కృష్ణయ్య

బీసీ  ఉద్యమానికి తెలంగాణ నుంచే శంఖారావం పూరిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రకటించారు.

  • Written By:
  • Updated On - September 23, 2023 / 04:34 PM IST

R.Krishnaiah: బీసీ  ఉద్యమానికి తెలంగాణ నుంచే శంఖారావం పూరిస్తామని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రకటించారు. తాము చేపట్టే ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సంపూర్ణ సహకారం, మద్దతును  ప్రకటించారన్నారు. దశాబ్దాలుగా ఎదురుచూసిన మహిళా బిల్లు కోసం కవిత చేసిన పోరాటం ఫలించిందని అందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని ఎమ్మెల్సీ కవితపై కృష్ణయ్య ప్రశంసలు కురిపించారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లతో ఆమెను కలిశారు. తాము చేపట్టే బీసీ ఉద్యమానికి మద్దతు పలకాలని కోరారు. ఈ విషయంలో ఆర్. కృష్ణయ్య సహా పలు బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల ప్రతినిధులు దేశంలో నెలకొన్న రాజకీయాలు, ప్రత్యేకించి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం వెనుక జరిగిన పరిణామాలు, అనంతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి జాగృతి సంస్థ ద్వారా ఎమ్మెల్సీ కవిత  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, విస్తరణ కోసం పనిచేశారని, బతుకమ్మ ఖ్యాతిని పెంచటంలో క్రియాశీల పాత్ర పోషించారని, అదే స్ఫూర్తితో మహిళా బిల్లు కోసం అనేక ప్రయత్నాలు చేశారని ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య  వివరించారు. పార్లమెంట్ ఆమోదించిన మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత పూర్తి సంతృప్తిగా లేరన్నారు. ఆమోదించిన మహిళా బిల్లును ఆత్మలేని శరీరం వంటిదని కవిత వాపోవటమే అందుకు నిదర్శనం అన్నారు. మహిళా బిల్లులో బీసీలకు అన్యాయం జరిగిందనే కచ్చితమైన అభిప్రాయంతో ఎమ్మెల్సీ కవిత ఉన్నందుకు తమకు గర్వంగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును సవరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ నుంచే బలమైన బీసీ ఉద్యమ నిర్మాణం చేపట్టి కేంద్రం మెడలు వంచి తీరుతామని కృష్ణయ్య స్పష్టం చేశారు. తాము చేపట్టే బీసీ ఉద్యమానికి తన జాగృతి సంస్థ ద్వారా, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలిగా కవిత తమకు సంపూర్ణ మద్దతను ఇస్తామని ప్రకటించాలని కోరేందుకు వస్తే తమకు అభిమతాన్ని స్వీకరించి సంపూర్ణ మద్దతును ఇచ్చినందుకు ఆయన ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించటం, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ కులగణన అనే ఈ మూడు డిమాండ్లతో మరో జాతీయ బీసీ ఉద్యమానికి ఉద్యమాల తెలంగాణ గడ్డ నుంచే శంఖారావం పూరిస్తామని చెప్పారు.

అందులో భాగంగా ఈనెల 26న జలవిహార్లో రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులతో సదస్సు నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు.  దశాబ్దాల కాలంగా బీసీ రిజర్వేషన్ల కోసం తాము ఉద్యమిస్తున్నామని, ఇప్పటికే 85 సార్లు ఢిల్లీలో ధర్నా నిర్వహించామని, దేశాన్ని ఏలిన ప్రధానమంత్రులను 65సార్లు కలిసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపటాన్ని తాము స్వాగతిస్తూనే అందులో బీసీలకు చోటులేకపోవడంపైనా తాము ఉద్యమిస్తామన్నారు. కేంద్రం బీసీ బిల్లు పెట్టి ఆమోదించేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈనెల 26న జలవిహార్లో సదస్సు నిర్వహించిన తరువాత బీసీ బిల్లు కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని, బీసీ బిల్లును పార్లమెంట్ ఆమోదించేదాకా  దశలవారీగా దేశవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేసి ఉద్యమాన్ని చేస్తామని ఆయన స్పష్టం చేశారు.