Site icon HashtagU Telugu

Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద నీరు.. 10 గేట్లు ఎత్తిన అధికారులు

Srisailam

Srisailam

శ్రీశైలం డ్యాంకు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుంది. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 2.65 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో శ్రీశైలం డ్యాం నీటిమట్టం వాస్తవ సామర్థ్యం 885 అడుగులకు గాను సోమవారం నాటికి 884.60 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 10 క్రెస్ట్ గేట్లను ఎత్తి 2.7 లక్షల క్యూసెక్కుల నీటిని డ్యాం నుంచి విడుదల చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటి నిల్వ మట్టం కూడా పూర్తి స్థాయి నీటిమ‌ట్టం  590 అడుగులకు గాను 589.70 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం ఎగువ ప్రాజెక్టు నుంచి ప్రాజెక్టుకు 2.27 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు భారీగా 2.18 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, శ్రీశైలం వైపు 2.15 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

మరోవైపు తుంగభద్ర డ్యాం ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్థాయి 1633 అడుగులకు చేరుకోవడంతో అధికారులు క్రెస్ట్‌గేట్లను ఎత్తి 14,111 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు 100.87 టీఎంసీల స్థూల నిల్వను కొనసాగిస్తోంది. కడెం ప్రాజెక్టు కూడా ఎఫ్‌ఆర్‌ఎల్ స్థాయి 700 అడుగులకు చేరుకోగా 1019 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 1.2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఎఫ్‌ఆర్‌ఎల్‌ 1615 అడుగులకు గాను నీటి నిల్వ 1613.98 అడుగులకు చేరుకుంది.

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ఎగువ మహారాష్ట్ర నుండి కూడా స్థిరమైన ఇన్‌ఫ్లో పొందుతోంది. గడచిన 24 గంటల్లో ప్రాజెక్టుకు 109631 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, నీటిమట్టం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1091 అడుగులకు చేరుకుంది. నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు 37442 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌ 1405 అడుగులకు గాను ప్రాజెక్టు నీటిమట్టం 1404.16 అడుగులకు చేరింది. నదిలో భారీగా నీరు ప్రవహిస్తుండటంతో అన్ని డ్యామ్‌లలోని లోతట్టు ప్రాంతాల్లో అలర్ట్‌ ప్రకటించారు.