Gujjula Premendar Reddy : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చింది. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని తమ అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు తెలంగాణ బీజేపీ అధికారికంగా బుధవారం ప్రకటించింది. రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుంది. గురువారం ఉదయం 11 గంటలకు నల్లగొండలో ప్రేమేందర్ రెడ్డి (Gujjula Premendar Reddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ పరిణామంతో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సన్నిహితుడు ప్రకాశ్ రెడ్డికి మొండిచెయ్యి మిగిలింది. తనకు అభ్యర్థిత్వం దక్కుతుందనే ఆశలు పెట్టుకున్న ప్రకాశ్ రెడ్డి నిరాశకు గురయ్యారు. ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారన్న ఓ ప్రశ్నకు గతంలో కిషన్ రెడ్డి బదులిస్తూ.. ‘‘ప్రకాశ్ రెడ్డి అర్హుడే. ఆయన ఎమ్మెల్సీ టికెట్ను ఆశించడంలో తప్పేముంది ?’’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న బరిలోకి దిగారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 30 నామినేషన్లు దాఖలయ్యాయి. మే నెలాఖరులో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి 2021 సంవత్సరంలో జరిగిన ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. అప్పట్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది. మే 2న ఎమ్మెల్సీ బై పోల్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 10న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు లాస్ట్ డేట్ మే 13. ఉప ఎన్నికల పోలింగ్ మే 27న ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు వరకు జరుగుతుంది.జూన్ 5న ఓట్ల లెక్కింపును నిర్వహిస్తారు.